బాబూ! అల్లాడుతున్నా పట్టించుకోరా?: ఒక్కసారి అవకాశమిస్తేనంటూ పవన్ ఉద్వేగం
Recommended Video

విజయనగరం: ఐదేళ్లు పాలించే అవకాశం జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎస్.కోట(శృంగవరపుకోట)లోని దేవి గుడి జంక్షన్లో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
కొన్ని రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రలో జనసేన పోరాట యాత్ర సాగగా.. రంజాన్ పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించిన పవన్ సోమవారం నుంచి మళ్లీ తన యాత్రను ప్రారంభించారు.

రెచ్చగొడుతున్నానా?
ఐదేళ్ల పాటు పాలించే అవకాశం జనసేనకు ఇస్తే మళ్లీ ఎప్పటికీ తమనే ప్రజలు కోరుకునేలా పరిపాలన అందిస్తామని పవన్ స్పష్టంచేశారు. ఉత్తరాంధ్రను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. రెచ్చగొడుతున్నారని అంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

బాబు వచ్చారు.. జాబేది?
నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ నిరుద్యోగులకు కాకుండా తన కొడుక్కి మాత్రమే జాబు ఇచ్చారని ఎద్దేవా చేసారు. నిరుద్యోగభృతి కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు.

అభివృద్ధి శూన్యం
శృంగవరపు కోటలోని రైల్వే బ్రిడ్జి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉందని... ఇక్కడ మొత్తం 35 సంవత్సరాలలో 30 సంవత్సరాల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమని పవన్ మండిపడ్డారు. పోలవరం, పట్టిసీమకు డబ్బులుంటాయి కాని, ఉత్తరాంధ్ర సాగు నీటి ప్రాజెక్ట్లకు మాత్రం డబ్బులుండవని మండిపడ్డారు. ఇక్కడే గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి.. అవి అన్నీ కూడా వెనకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.

అల్లాడుతున్నా పట్టించుకోరు..
అంగన్వాడి కార్మికులతో సహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రూ. 5, 6 లక్షలు లంచాలుగా టీడీపీ నేతలు దండుకోవడం దారుణమని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమల కోసం వేల ఎకరాలు తీసుకుంటారు.. కానీ, ఆ తర్వాత పరిశ్రమలు ఉండవు... ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఉండవని ఆయన ఆరోపించారు. తాటిపూడి రిజర్వాయర్ నీటి కోసం విజయనగరం జిల్లా రైతులు అల్లాడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

డబ్బు మీద వ్యామోహం లేదు..
జోన్ లేదు గీన్ లేదు అని కొందరు ఎంపీలు మాట్లాడుతుండటం విచారకరమని పవన్ అన్నారు. పతంజలీ పుడ్ పార్క్, జిందాల్ కోసం జిల్లాలో వందల ఎకరాలిచ్చారు.. కానీ, కంపెనీలు లేవు..రైతులకు సాగు భూమీ లేదని ఆయన అన్నారు. తనకు డబ్బు మీద వ్యామోహం లేదని... ఆకాంక్ష ఉందని తెలిపారు. వైజాగ్లో ఉత్తరాంధ్ర వారు కంపెనీ పెడితే 3కోట్లు ఎకరా.. అదే...చంద్రబాబు సన్నిహితులకు మాత్రం 35 లక్షలకే ఏకరా కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు.

ఒక్కసారి అవకాశమిస్తే..
‘ఉత్తరాంధ్రలో కూడా అమరావతిలా అభివృద్ధి జరగాలి. 5 సంవత్సరాలు జనసేనకి అండగా నిలబడండి... జీవితాంతం జనసేన మీకు తోడుగా ఉండేట్లు చేస్తాం' అని పవన్ ఉద్వేగంతో మాట్లాడారు. గజం తీసుకొని వెయ్యిగజాలు మైనింగ్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రభుత్వమే రియలెస్టేట్ కంపెనీలా మారుతోందని ధ్వజమెత్తారు. 20 వేల మంది సాక్షరభారత్ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఎన్ని మాటలు మార్చిందో వీడియో విడుదల చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన మాత్రం ఎప్పుడూ ఒకేమాట మీద నిలబడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications