దమ్ముందా? అవిశ్వాసంపై ఎందుకిలా?: టీడీపీ, వైసీపీలపై పవన్ ఆగ్రహం, ‘48గంటల డెడ్లైన్’
Recommended Video
గుంటూరు: అతిసారా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే గుంటూరు బంద్కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు దిగుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కలుషిత నీటిని తాగడం వల్ల అతిసారా(డయేరియా)తో బాధపడుతూ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారిని తీసుకురాలేం, దీనికి ఎవరు బాధ్యులు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రమాదకరం, టీడీపీ, బీజేపీ వల్లే: అవిశ్వాసంపై జగన్, మద్దతు కోరుతూ వివరణాత్మక లేఖ
మీ ఇంట్లో వాళ్లు చనిపోయినా..
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 14మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శుద్ధమైన తాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందని పవన్ నిలదీశారు. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా?' అని పవన్ మండిపడ్డారు.
జగన్ పార్టీ అలా అంటే కుదరదు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావాలని, రానంటే కుదరదని పవన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు తనకుందని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాను బలంగా మాట్లాడాల్సి ఉంటుందని, ప్రత్యేక హోదాపై ఏ పార్టీకి క్లారిటీ లేదని పవన్ వ్యాఖ్యానించారు.
గందరగోళంలో టీడీపీ, వైసీపీ
అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ.. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు అవిశ్వాసంపై స్పష్టత లేదని పవన్ అన్నారు. అవిశ్వాసంపై ఇంత గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. హడావుడిగా అవిశ్వాస తీర్మానాలు ఎందుకని నిలదీశారు.
అయోమయంలో వైసీపీ
తాను 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని సూచిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ మార్చి 23న పెడతామని చెప్పిందని.. ఇప్పుడేమో మాట మార్చిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన తేదీని ఎందుకు మార్చాల్సి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అవిశ్వాసంపై ఎందుకంత అయోమయానికి గురవుతున్నారని అన్నారు.
టీడీపీ అప్పుడలా.. ఇప్పుడిలా ఎందుకు?
ఇక తెలుగుదేశం పార్టీ నిన్నమొన్నటి వరకు అవిశ్వాసం ఎందుకని ప్రశ్నించిందని పవన్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడెందుకు అవిశ్వాస తీర్మానం పెడుతోందని పవన్ నిలదీశారు.
టీడీపీ, వైసీపీలు కుమ్మక్కయ్యాయి..
ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై టీడీపీ, వైసీపీ ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
ఎన్డీఏతో పోరాడే దమ్ము టీడీపీకి లేదు.. నాకు బొక్కల్లేవ్
తనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఎన్డీయేతో పోరాడే దమ్ము టీడీపీకి లేదని... తనకు మాత్రమే ఉందని అన్నారు. నిన్నటి వరకు టీడీపీ మనిషిని అన్న మీరు.. ఇప్పుడు బీజేపీకి చెందిన వాడినని అంటున్నారని మండిపడ్డారు. లూప్హోల్స్ ఉన్నవాళ్లు కేంద్రాన్ని నిలదీయడానికి భయపడతారేమో గానీ తాను కాదని తేల్చి చెప్పారు. కేంద్రాన్ని నిలదీసే హక్కు తనకు ఉందని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాను కూడా గట్టిగా మాట్లాడాల్సి వస్తుందని పవన్ మరోసారి హెచ్చరించారు.