తిరుమలలో మత మార్పిడులు.. ముఖ్యమంత్రికి తెలియవా? పవన్ కల్యాణ్ ఫైర్
రాయలసీమ పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయమే పవన్ కల్యాణ్ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సాధారణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడుతూ..

ఉల్లిధర పెంపుపై
ఉల్లిధర విపరీతంగా పెరిగిపోవడం వలన దిగువ, మధ్య తరగతి ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. రోజు వారు కూలీలు సంపాదించిన సొమ్ములో ఉల్లిగడ్డకే రూ.80 రూపాయలు ఖర్చు చేయడం భారంగా మారిందని అంటున్నారు. ఉల్లిగడ్డ కొనడానికి గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి ఉంది. అత్యధిక సీట్లు గెలుచుకొన్న సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ ధరల నియంత్రణలో విఫలమైంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

కూల్చివేతలు, కాంట్రాక్టులపైనే దృష్టి
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు, కాంట్రాక్టులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రైతులకు గిడ్డంగులు కట్టాలనే ఆలోచన చేయలేకపోయింది. అలా కాకుండా సాధారణ ప్రజలకు ఏం కావాలో వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేయకుండా ఆరు నెలలు వృథా చేసింది. ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసి.. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూల్చివేయడానికే ప్రధానంగా దృష్టిపెట్టారు అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

రాయలసీమ వెనుకబాటుతనంపై మాట్లాడితే..
రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడితే తనపై విమర్శల దాడి చేస్తున్నారు. సీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు నేతల భూములు పచ్చదనంతో కనిపించాయి. రైతుల భూముల మాత్రం బీడు బారిపోయి కనిపించాయి. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా వెనుకబాటుతనం ఉండటం వారి నిర్లక్ష్యమే అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైతుల కోసం శీతల గిడ్డంగులు కట్టించలేకపోవడం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని పవన్ కల్యాన్ పేర్కొన్నారు.

తిరుమలలో అన్యమత ప్రచారం దారుణం
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందనే వార్తలు అత్యంత దారుణం. హిందూ ధర్మానికి నష్టం జరిగితే తప్పకుండా స్పందిస్తాను. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియవా? ఎవరి అండ చూసుకొని మత మార్పిడులు జరుగుతున్నాయి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్ల బ్యాంకు రాజకీయాలు తగవని పవన్ కల్యాణ్ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణపై నా వ్యాఖ్యలు వక్రీకరించారు.












Click it and Unblock the Notifications