కోనసీమ క్రాప్ హాలిడే వైసీపీ విధానాలవల్లే; వైసీపీనాయకుల చౌకబారు వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్ ఫైర్
ఆంధ్ర అన్నపూర్ణగా ప్రాముఖ్యతను సంతరించుకున్న కోనసీమ ప్రాంతంలో అన్నదాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో కోనసీమ రైతు పరిరక్షణ సమితి క్రాప్ హాలిడే కు పిలుపునిచ్చారు. దీంతో కోనసీమ రైతుల క్రాప్ హాలిడే పై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కోనసీమ క్రాప్ హాలిడే పాపం వైసిపి దేనని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల క్రాప్ హాలిడే వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే
రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్త వైఖరి వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలు అయినా ఉండాలని, కానీ అటువంటి అన్నదాతలే పంటలు పండించేది లేదని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నపూర్ణ వంటి కోనసీమ లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాల వల్ల క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు పవన్ కళ్యాణ్.
దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ క్రాప్ హాలిడే బాధాకరం
ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించలేదని, కాలువలు, డ్రైన్లు మరమ్మతులు, పూడికతీత పనులపైన దృష్టి సారించరని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక ఇబ్బందుల కారణంగానే రైతాంగం పంట వేయకూడదని నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇటువంటి పరిస్థితులు రావడం బాధాకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పంట విరామం ప్రకటించిన రైతాంగం పై వైసిపి నాయకులు రాజకీయ విమర్శలు దారుణం
దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోంది పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడటం తప్ప సమస్యను పరిష్కరించే మనస్తత్వం వైసీపీ ప్రభుత్వానికి లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పంట విరామం ప్రకటించిన రైతాంగం పై వైసిపి నాయకులు రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ నాయకులు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు
అంతేకాదు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితో ఈరోజు కోనసీమ రైతాంగ ఇబ్బంది పడుతుందని, వైసిపి నాయకులవి చౌకబారు విమర్శలు అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళను ఇలాగే తిట్టారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇక 10వ తరగతి పరీక్షా ఫలితాల పై తల్లిదండ్రులదే తప్పంటూ వ్యాఖ్యలు చేశారని, ఆడబిడ్డల మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని విమర్శలు చేశారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యత లేదని వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ ని ఎండగట్టారు.

కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుంది
కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కోనసీమ రైతాంగ సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తాను హామీ ఇస్తున్నట్లు గా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications