ఉత్తరాంధ్రలో ట్విస్టులు-అప్రమత్తమైన పవన్-లోకేష్ కంటే ముందే రంగంలోకి నాదెండ్ల !
విశాఖ రాజధానితో వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఇక్కడ మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు గత మూడున్నరేళ్లుగా చేస్తున్న అక్రమాలపై ఆగ్రహంగా ఉన్న ఓ వర్గం ప్రజలు రాజధాని పేరుతో సాగుతున్న రాజకీయంపై మండిపడుతున్నారు. వీరి అసంతృప్తిని సొమ్ముచేసుకునేందుకు టీడీపీ దూకుడుగా ముందుకెళ్లలేకపోతోంది. దీంతో సహజంగానే వీరిని ఆకట్టుకునేందుకు జనసేనాని పవన్ వ్యూహరచన చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నాదెండ్ల మనోహర్ టూర్ ఇందులో భాగమే అంటున్నారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ అవస్ధలు
ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండే బీసీ జనాభాను నమ్ముకుని టీడీపీ గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వచ్చింది. అయితే 2019లో దారుణ ఓటమి తర్వాత పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. విశాఖ నగరంలో నాలుగు సీట్లు కైవసం చేసుకున్న టీడీపీ, జిల్లాలో మాత్రం ఖాతా తెరవలేదు. అలాగే విజయనగరం జిల్లాలో వైట్ వాష్ అయిపోయింది. శ్రీకాకుళంలో రెండు సీట్లు గెల్చుకుంది. దీంతో జగన్ హవాలోనూఈ మాత్రం ప్రభావం చూపడం టీడీపీకి భవిష్యత్తులో ప్లస్ అవుతుందని అంతా భావించారు. కానీ శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, విశాఖలో వెలగపూడి రామకృష్ణ, అనకాపల్లి జిల్లాలో అయ్యన్నపాత్రుడు మినహా టీడీపీకి గట్టిగా పోరాడే వారు లేకపోయారు.
వీటికి తోడు మూలిగేనక్కపై తాటిపండు పడినట్లుగా జగన్ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. దీంతో టీడీపీ పూర్తిగా కుదేలవుతోంది.
మూడు రాజధానులకు మిశ్రమ స్పందన
వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ కు స్ధానికంగా ఆశించిన మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా అధికారంలో ఉండి విశాఖ గర్జన నిర్వహించినా ప్రజలు మాత్రం మూడు రాజధానుల పేరుతో సాగుతున్న రాజకీయాన్ని నమ్మడం లేదు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు ఇప్పటికే పలు ర్యాలీలు నిర్వహించినా ఆ వేడి మాత్రం రగలడం లేదు. అలాగని పూర్తి వ్యతిరేకతా లేదు. దీంతో ధర్మాన ప్రసాద్ వంటి మంత్రులు సైతం జనం మూడు రాజధానులకు మద్దతివ్వాలని పదేపదే కోరుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పూ లేదు. అన్నింటికంటే మించి కోర్టు తీర్పు రాకముందే వైసీపీ చేస్తున్న హంగామాపై జనానికి నమ్మకం కుదరడం లేదు.
ఉత్తరాంధ్రపై జనసేనఫోకస్
ఉత్తరాంధ్రలో అటు వైసీపీ మూడు రాజధానులకు పూర్తి మద్దతు లభించడం లేదు. అదే సమయంలో టీడీపీ చేస్తున్న రాజకీయం కూడా జనంలో నమ్మకం కల్పించలేకపోతోంది. దీంతో ఉత్తరాంధ్ర వాసులు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి కాపులు, తూర్పుకాపుల్లో పట్టు కలిగిన జనసేన, ఇప్పుడు టీడీపీకి కాస్తో కూస్తో అండగా ఉన్న బీసీల్ని సైతం తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీపై వీరికి ఆసక్తి సన్నగిల్లడం వల్లే వైసీపీ దూకుడుగా రాజకీయాలు చేయగలుగుతుందని భావిస్తున్న జనసేన.. ఇప్పుడు వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
లోకేష్ కంటే ముందే నాదెండ్ల !
వచ్చే ఏడాది జనవరి 27 నుంచి టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ పాదయాత్ర ఎంత లేదన్నా శ్రీకాకుళానికి చేరే సరికి మరో ఏడాది పట్టడం ఖాయం. అప్పటివరకూ ఆగకుండా ఇప్పటి నుంచే ఉత్తరాంధ్రలో వరుస పర్యటనలుచేసేందుకు జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి విజయనగరంలో పర్యటిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోనూ పర్యటించి అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైసీపీని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. అనంతరం పవన్ కూడా పర్యటించేందుకు రంగం సిద్ధమవుతోంది. క్లైమాక్స్ లో లోకేష్ పాదయాత్ర రూపంలో ఉత్తరాంధ్రకు చేరుకునే లోపు జనసేన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.