జగన్ దారిలో పవన్ కళ్యాణ్! అదే దారిలో.. పావులు కదుపుతున్న జగన్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడుస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తెరపైకి జూ.ఎన్టీఆర్, తెలంగాణలో టీడీపీ ఉంటుంది: బాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్తో పొత్తుపై..
ప్రత్యేక హోదా కోసం జగన్ యూనివర్సిటీ విద్యార్థులతో సభలు, సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ప్రయోజనాలు తెలియజెప్పేందుకు, వారి నుంచి ఉద్యమాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.
అదే దారిలో జనసేనాని
ఇప్పుడు జనసేనాని కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు టీ షర్టులు పంపిణీ చేయాలని జనసేన నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ టీ షర్ట్ పైన ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే నినాదం ముద్రించారు.
ఇలా ముందుకు వెళ్లాలని
పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ హోదా పోరాటాన్ని యూనివర్సిటీ వేదికగా ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లాలని భావిస్తోంది. ఇందుకు జనసేన విద్యార్థి విభాగం విధివిధానాలను రూపొందించింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికపై డిజిటల్ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టింది.
టీడీపీ యూ టర్న్
2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే అన్ని పార్టీలకు నినాదం కానుంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మళ్లీ హోదా అంటూ గళమెత్తుతున్నారు. నిన్నటి వరకు హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చెప్పిన టీడీపీ 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హామీలు నెరవేర్చలేదంటూ హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.
నిన్న జగన్, నేడు పవన్ కళ్యాణ్
మరోవైపు, వైసీపీ.. టీడీపీ ఎంపీలకు ధీటుగా ఢిల్లీలో హోదాపై పోరాడింది. మార్చి 21 కేంద్రంపై అవిశ్వాసం, ఏప్రిల్ 6న రాజీనామాలకు సిద్ధమని చెప్పింది. అయితే ఇదివరకు జగన్ యువత, విద్యార్థుల ద్వారా హోదా ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభలు పెట్టారు. ఇప్పుడు పవన్ టీషర్టులు పంచి మరోసారి యూనివర్సిటీల్లో హోదా అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు.
పవన్, చంద్రబాబుపై జగన్ వ్యూహాలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశంతో బీజేపీని ఇరుకున పెట్టడంతో పాటు హోదా అంశాన్ని సాధ్యమైనంత మేర రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పనిలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. మరోవైపు, విభజన చట్టం మేరకు వచ్చిన లెక్కలపై పవన్ వేసిన జేఎఫ్సీని విమర్శిస్తూ, ఇంకోవైపు రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం పేరుతో టీడీపీ వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు జగన్ పావులు కదుపుతున్నారు.