ఎవరి పల్లకీలు మోసేందుకు లేమిక్కడ!: 2024 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: వచ్చే(2024) ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీకి అసలు ఓటు అడిగే హక్కే లేదన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు.
జగన్ పార్టీ మరోసారి అధికారంలోకి రాదు: పవన్ కళ్యాణ్
రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీకి ఓటడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదని అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడవద్దని సూచించారు. తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై చాలా ఆలోచించే మాట్లాడానని తెలిపారు. తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటే వైసీపీకి ఉలుకెందుకు? అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకం, దోపిడీతో రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందు వల్లే ఆ మాట మాట్లాడానన్నారు. అంతే తప్ప తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహం కోసం కాదన్నారు.
ఎవరి పల్లకీలు మోసేందుకు లేమిక్కడ: పవన్ కళ్యాణ్
ఎవరి పల్లకీలూ మోసేందుకు తాము ఇక్కడ లేమని.., ప్రజలను పల్లకిలో ఉంచేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అంటే వైసీపీ నేతలకు భయమెందుకని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నిస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంతగనులు ఇస్తారని నమ్ముతున్నా ఇప్పుడున్నది కొత్తతరమని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. 2018లో కరెంట్ ఛార్జీల పెంపును జగన్ వ్యతిరేకించారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బాదుడే బాదుడంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించిన వైఎస్ జగన్.. ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల్లోనూ కులాలు చేస్తారా?: పవన్ కళ్యాణ్
రైతుల ఆత్మహత్యలు చూస్తే చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విపత్తు వచ్చినా మొదట నష్టపోతుంది రైతులేనని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న అనేకమంది రైతుల రుణం రూ.5 లక్షల్లోపే ఉందని గుర్తు చేశారు. రైతు కుటుంబాలకు మంచి మనసుతో సాయం చేస్తున్నామని తెలిపారు. కౌలురైతులకు సాయం చేయడాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వైసీపీ నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది కానీ.. ఇవ్వడంలో లేదని పవన్ విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో అన్ని కులాలవారు ఉన్నారు. అన్నం పెట్టే రైతులో కూడా ఎవరైనా కులం చూస్తారా ? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
అమరావతి కోసం బలమైన పోరాటం: పవన్ కళ్యాణ్
సంపద సృష్టికి.. రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రాజధానిపై మనం బలంగా పోరాడాలన్నారు. కర్నూలు, తిరుపతిని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు పవన్. ఎన్నికలు ముందుగా వచ్చినా మనం సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఎందుకు పెరిగిందో ఆలోచించాలన్నారు. ఏ ఉపాధీ లేని యువత తప్పుడు మార్గం వెతుక్కుంటారని అన్నారు. యువతకు ఉపాధి లేకుంటే నేరాల రేటు కూడా పెరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన పోరాటం మరింత ఉధృతం చేస్తుందని అన్నారు.