చిరంజీవికి అవమానం, జగన్కు అంత అహంకారం: బీమ్లానాయక్ వదిలేశానని పవన్ కళ్యాణ్
కడప: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. మొత్తం 173 మందికి రూ. 1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధవటంలో ఏర్పాటు చేసిన సబలో ఆయన మాట్లాడారు.

ప్రజారాజ్యం ఉంటే ఏపీ పరిస్థితి ఇలా ఉండేది కాదన్న పవన్
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కౌలు రౌతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు పవన్. కౌలు రౌతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు. పద్యం పుట్టిన రాయలసీమలో జగన్ సర్కారు మద్యం పారిస్తోందని విమర్శించారు. ఇంటింటికీ చీప్ లిక్కర్ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఏపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు పవన్. ప్రస్తుతం వైసీపీలో మంత్రులుగా ఉన్నవారు, మంత్రులుగా పనిచేసినవారు దగ్గరుండి విలీనం చేయించారని మండిపడ్డారు.

వైఎస్ షర్మిలపై పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు
తాను ఎప్పుడూ కులమతాల గురించి ఆలోచించనని పవన్ అన్నారు. కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందన్నారు. రాయలసీమలో 11 శాతం ఉన్న మాదిగలు, 8 శాతం ఉన్న మాలల గురించి పట్టించుకున్నారా? కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తాను అని పవన్ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలన్నారు. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారని వైఎస్ షర్మిల గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

జనం కోసమే జనసేన.. ఆదరించాలంటూ పవన్ కళ్యాణ్
సొంత బాబాయ్ని చంపిన వారిని ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని పవన్ ప్రశ్నించారు. కోడి కత్తితో జగన్పై దాడి చేస్తే ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. ఇప్పుడు సీఎం మీరే కదా? ఇప్పుడెందుకు నమ్మకం లేదు? అని ప్రశ్నించారు. ఎంతకాలం దోపిడీ, దౌర్జన్యాలు చేస్తారని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. రాయలసీమలో వెనుకబడినవారిని తలెత్తుకునేలా చేస్తామన్నారు. మార్పు కోసమే జనసేన మీ ముందు నిలబడిందని చెప్పారు. ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించండి అని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
జగన్ అహంకారంతో చిరంజీవినే అవమానించారంటూ పవన్ కళ్యాణ్
మరోవైపు, సీఎం జగన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయితే దిగొచ్చావా? కొమ్ములుంటాయా? ఎంతకాలం జగన్ కు భయపడతాం. కోట్లాది అభిమానులున్న చిరంజీవితో కూడా జగన్.. చేతులు జోడించి దండం పెట్టించుకున్నారు. చిరంజీవిని చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేశారు. మెగాస్టార్ను కూడా కింద కూర్చోబెడతామనే దోరణి ఎందుకు? ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాల్సిన వ్యక్తిని అవమానిస్తారా? నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదని సంస్కారం నీది. ఎంత అహంకారం అంటూ సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ఏపీలో బీమ్లానాయక్ను అందుకే వదిలేనంటూ పవన్ కళ్యాణ్
మెగాస్టార్ లాంటి వ్యక్తులకే ఇలా అయితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు పవన్. ఉంటే ఉంటాయి పోతే పోతాయి ఆస్తులు. ఆత్మగౌరవం చంపుకుని బతకలేం. అలా పెరగలేదు. కష్టపడి తింటూ వచ్చి సంస్కారం లేని వ్యక్తికి నమస్కారం పెట్టలేం. అందుకే బీమ్లా నాయక్ను ఏపీలో వదిలేశాం. దీనిపై జాతీయ(కేంద్రంలోని) నాయకులను కోరితే వారు ఏదైనా చేసేవారు. కానీ, నేను అలా చేయలేదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications