''అతను'' అసెంబ్లీలో ఉంటే రాజకీయాలు వేరుగా ఉండేవి??
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారిన నేత జనసేనాని పవన్ కల్యాణ్. రాష్ట్రానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టివుంటే రాజకీయాలు మరో తరహాలో ఉండేవంటూ రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ, తన సొంత డబ్బుతో కౌలు రైతులను ఆదుకుంటూ వైసీపీ లేని రాష్ట్రాన్ని చూస్తారంటూ చేస్తున్న ప్రకటనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్ను బాగా చికాకు పరుస్తున్నాయనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
కొన్నాళ్లుగా దూకుడైన రాజకీయం చేస్తున్న పవన్కల్యాణ్ ఈసారి తాను అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా జనసేన నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని అసెంబ్లీకి పంపించడానికి ఇప్పటి నుంచే కసరత్తుల ప్రారంభించారు.
పొత్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమిపాలైన పవన్ కల్యాణ్ తనతోపాటు పార్టీ కూడా ఓటమిపాలైందనే విషయాన్ని అప్పుడే మరిచిపోయారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వేగంగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడమే కారణమని భావిస్తున్న పవన్ ఈసారి వ్యతిరేక ఓటును చీలనివ్వనని, అవసరమైతే పొత్తులకు సిద్ధమేనని ప్రకటించారు.
తెలుగుదేశంపార్టీకి, బీజేపీకి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో చొరవ తీసుకున్నారు. కానీ తాను అనుకున్న స్పందన లేకపోవడంతో బీజేపీ లేకుండా టీడీపీతో కలిసి వెళ్లడానికి సిద్ధపడ్డారు. కానీ పొత్తుల విషయమై రెండు పార్టీ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. కింగ్ మేకర్గానైనా అవతరించాలనే పట్టుదలతో పవన్ ఎంపిక చేసిన నియోజకవర్గాలపై దృష్టిసారించారు.
ప్రజా సమస్యలపై బలమైన గొంతుక
ప్రజల సమస్యలపై బలమైన గొంతుక వినిపిస్తున్న జనసేనాని గళం అసెంబ్లీలో ఉంటే వైసీపీ ప్రభుత్వ పనితీరు వేరుగా ఉండేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాపాక వరప్రసాద్ బదులు పవన్ ఉండివుంటే జనసేన మరింత బలోపేతమయ్యేదని, స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో తనదైన ప్రభావం చూపివుండేదని, మొదటి నుంచి పవన్ కోరుతున్నట్లుగా బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ నేతనే ప్రకటించివుండేవారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమయ్యేవాళ్లం
పవన్కల్యాణ్ అసెంబ్లీలో ఉండివుంటే వైసీపీ, తెలుగుదేశం సరసన తమ పార్టీని నిలబెట్టడానికి అవకాశం లభించేదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమై ఉండేదని, కేంద్ర ప్రభుత్వ రాజకీయాలు కూడా మారేవని, వారి ఆలోచనల్లో మార్పువచ్చేదని జనసేన నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
పవన్ కల్యాణ్ లాంటి ఒక్క గొంతు అసెంబ్లీలో వినిపిస్తే ఎన్ని ప్రయోజనాలుంటాయనే విషయం ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యేదని, ఇప్పుడు చూస్తున్న రాజకీయాలకు భిన్నమైన రాజకీయ వాతావరణం ఏపీలో ఉండేదంటున్నారు. రానున్న ఎన్నికల్లో తమ నేత భారీ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.