అడవితల్లి బాటలో పవన్ కళ్యాణ్; గిరిజన గ్రామాలకు ప్రణామం, అభివృద్ధికి శ్రీకారం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలలో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
గిరిజన గ్రామాలలో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకొని ఆసుపత్రులకు తీసుకు వెళ్లిన అనేక ఘటనలు మనం చూసాం. అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవితల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పాటు గిరిజన గ్రామాలలో పర్యటించనున్నారు. నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

నేడు, రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్
ఈ క్రమంలో ఆయన గిరిజనుల ఆవాసాలను సందర్శించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని గిరిజన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక నేడు, రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ విషయానికి వస్తే నేడు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఎనిమిది గంటలకు విశాఖపట్నం కి చేరుకుంటారు.
నేడు అడవితల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, బహిరంగ సభ
పవన్ కళ్యాణ్ అక్కడ నుండి రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం చాపరాయికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. ఇక అక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి, అక్కడ గిరిజన ప్రజల ఆవాసాలను సందర్శిస్తారు. అక్కడ అడవి తల్లి బాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు . అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
నేడు రాత్రి అరకులో బస.. రేపటి షెడ్యూల్ ఇలా
అక్కడినుండి మళ్లీ డుంబ్రిగూడ కు చేరుకొని మొత్తం అల్లూరి సీతారామరాజు జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణానికి అక్కడినుండే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్ లో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు వెళతారు. అక్కడ అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు.
ఎకో టూరిజానికి ఉన్న అవకాశాల పైన పవన్ దృష్టి
అనంతరం అక్కడి నుండి విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు పవన్ కళ్యాణ్ వెళ్తారు. అక్కడ ఎకో టూరిజం పైన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి , ఎకో టూరిజానికి ఉన్న అవకాశాల పైన చర్చిస్తారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో రోడ్ల అభివృద్ధికి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహానికి పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications