కుక్కను నిలబెట్టినా అన్నారు కానీ: ఎన్టీఆర్పై పవన్ కళ్యాణ్, జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు!
Recommended Video

విజయవాడ: ఇటీవల నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. అభిమానులు కూడా పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పలుమార్లు సీనియర్ ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. తాజాగా, కడప జిల్లా నాయకులతో జరిగిన సమీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి చర్చనీయాంశంగా మారాయి.
కడప సమీక్షలో జనసేనాని మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారు మెదక్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని మాట్లాడారని, ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారని చెప్పారు. కానీ తన వెనుక లక్షలాది మంది జనసైనికులు ఉన్నారని, ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా లక్షలాది మంది అభిమానులు వచ్చారని, కానీ తాను తలకు ఎక్కించుకోను అని వ్యాఖ్యానించారు. తద్వారా తనకు పొగరు తలకు ఎక్కదని అభిప్రాయపడ్డారు.

కేవలం మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చా
జనసైనికుల బాధ తనకు తెలుస్తుందని పవన్ అన్నారు. నేను మీ బాధలను అర్థం చేసుకోగలనని చెప్పారు. నేను కేవలం మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని, మీరు ఒక బలమైన శక్తి ఉన్న సమూహమని, మీలో ఉన్న శక్తి వెలికితీసే వరకు అది ఎవరికీ తెలియదన్నారు. మీలోని శక్తిని వెలికితీసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఒక బోరు వేస్తే రాళ్లు, మట్టి ముందు వస్తాయని, అలా అని ఆపలేమని, లేదంటే నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు
నేను 2014లో పార్టీ పెట్టిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.. మీరు ఏం చేస్తారని చాలామంది అడిగారని, కానీ నేను గెలుపోటముల కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. వ్యవస్థ మీద ఉన్న విసుగుతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయ వ్యవస్థలో పోరాడేందుకు సహనం, పట్టుదల కావాలన్నారు.

మనల్ని చూసి భయపడుతున్నారు
2014లో నేను పార్టీ పెట్టకముందు అందరూ ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుందని చెప్పారని, కానీ మనం పార్టీ పెట్టాక ఏం మాట్లాడారో అర్థం కాక ఉండిపోయారని, కారణం పవన్ కళ్యాణ్ అని, నేను ఏం చేయబోతున్నానో అని అందరూ ఆలోచించారని చెప్పారు. టీడీపీ, వైసీపీలు తమను ఏమీ అనలేక వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు, జగన్లు మనల్ని చూసి భయపడుతున్నారన్నారు.

నాకు పదవి వస్తే ఇంకా బాగా చేస్తా
నేను ప్రజల కోసం పోరాటం చేస్తానని, ఈ ప్రక్రియలో పదవి వస్తే ఇంకా బాగా పని చేస్తానని పవన్ చెప్పారు. అంతేకాని పదవి వస్తేనే చేస్తాను అనే వ్యక్తిని కాదని చెప్పారు. నేను అన్నికులాలకు న్యాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. తెలంగాణ ఉధ్యమం సమయంలో తనను కూడా కొట్టేందుకు వచ్చారని, కానీ వారికి పరిస్థితులు వివరించాక వారు అర్థం చేసుకున్నారని చెప్పారు. శత్రువుకు కూడా గొడవ పెట్టుకోకుండా వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే శక్తి తనకు ఉందన్నారు.

మీరు కాకుంటే నన్ను ఎవరు తిడతారు
నాయకులు సరిగా పని చేయకుంటే సరిచేయాలని, నాయకులు తప్పు చేస్తే తనను నిందించాలని, మీరు కాకుంటే నన్ను ఇంకా ఎవరు తిడతారని పవన్ అన్నారు. మనకు ఎవరో శత్రువులు లేరని, మనకు మనమే శత్రువులమని, మనలో ఎన్ని విభేదాలు ఉన్నా అందరం కలిసి పని చేయాలన్నారు. నన్ను అనుసరించాలని, ఇతరులు తనను వ్యక్తిగతంగా తిడితే ఎలా భరిస్తున్నానో చూసి, అలాగే ఉండాలన్నారు.

పార్టీ నేతలపై అసహనం
నేను పార్టీ బలం గురించి అధ్యయనం చేసేందుకు కమిటీలు వేస్తే కొంతమంది ఏదో అధికారం ఇచ్చినట్లుగా బయట ప్రవర్తిస్తున్నారని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేది జనసైనికులకు అర్థమవుతోందని, కానీ కొంతమంది నాయకులకు అర్థం కావడం లేదన్నారు. పోరాటం ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయి, మార్పు తీసుకు రాకుంటే మనకు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా ఉపయోగం లేదన్నారు. నేను ఓ ఫారం ఇస్తున్నానని, మీరు ఒక మూడు రోజుల్లో మీ నియోజకవర్గాల్లో ఎవరు బాగా పని చేస్తున్నారనే విషయం రాసి ఇవ్వండని, కు, మతాలు అనే తేడా లేకుండా మీ మాటను గౌరవించి వారికి బాధ్యతలు అప్పగిస్తానని, మీలోంచి ఒక 5 మందిని మీరే నిర్ణయించుకోండని, ఒక కమిటీని వేసి నాకు అందిస్తే, నేను మీ మీద ఉన్న నమ్మకంతో గుడ్డిగా బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. కానీ బాగా పని చేయాలన్నారు. నాయకులు ఉండొచ్చు.. పోవొచ్చు.. కానీ జనసైనికులు మాత్రమే ఎప్పుడూ ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications