జగన్తో ఇలా, బాబుపై అలా: పవన్ కళ్యాణ్ ఎవరికీ అంతుబట్టడం లేదా?
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీలోని ఏ పార్టీ కూడా ఓ క్లారిటీకి రాలేకపోతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రజా సమస్యలపై పవన్ స్పం
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీలోని ఏ పార్టీ కూడా ఓ క్లారిటీకి రాలేకపోతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రజా సమస్యలపై పవన్ స్పందిస్తున్నారు.
గత గురువారం ఆయన అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాధితులు చెబుతుంటే సావధానంగా ఉన్నారు. చాలామంది ఎమోషనల్ అయ్యారు.
తాము నమ్మి పెట్టుబడులు పెట్టామని, మోసపోయామని, పవన్ కళ్యాణ్ కల్పించుకుంటే న్యాయం జరుగుతుందని వారు కోరారు. ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్... చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

టిడిపిని చిక్కుల్లో పడేశారు
అంతకుముందే, వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు శాసన సభలో అగ్రిగోల్డ్ అంశాన్ని లేవనెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొన్న జగన్ కావొచ్చు.. నిన్న పవన్ కళ్యాణ్ కావొచ్చు... మొత్తానికి వారు టిడిపి నేతలను చిక్కుల్లో పడేశారు.
అగ్రిగోల్డ్ వ్యవహరంలో అధికార పార్టీ నేతలు ఆస్తులు అడ్డదారిలో కొట్టేస్తున్నారని వైసిపి ఆరోపణలు చేస్తోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావును జగన్ ఇందులోకి లాగారు. అంతేకాదు, ఈ స్కాంలో పత్తిపాటి చిన్న వ్యక్తి మాత్రమేనని, పెద్దవారు ఉన్నారని ఆరోపించారు.

నిన్న జగన్.. నేడు పవన్ కళ్యాణ్
నిన్న (గురువారం) పవన్ కళ్యాణ్ కూడా అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తద్వారా పవన్ కూడా వారిని ఇరుకున పడేశారు.
మొదట వైయస్సార్ కాంగ్రెస్, ఆ తర్వాత జనసేన అధినేత అగ్రిగోల్డ్ వ్యవహారంపై స్పందించడం... టిడిపిని పునరాలోచనలో పడేలా చేసిందని అంటున్నారు. హాయ్ ల్యాండ్ను విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, అప్పుల కంటే అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు విక్రయిస్తే ఎక్కువ డబ్బు వస్తుందని పవన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ హెచ్చరిక
అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వానికి చెందాలే కానీ, ప్రభుత్వ పెద్దలకు చెందితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ఏ రాజకీయ నేత అయినా ఇలా చేస్తే ఉద్యమిస్తానని చెప్పారు. అసలు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వీలైతే ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ దాకా..
అయితే, పవన్ కళ్యాణ్ తీరు ఏపీలోని ఏ పార్టీకి అర్థం కాకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా టిడిపికి ఏమీ అర్థం కావడం లేదని అంటున్నారు. విపక్షాలకు కూడా అర్థం కాకుండా ఉన్నారట. ప్రత్యేక హోదాతో పాటు పలు సమస్యలు మొదలు.. నిన్నటి అగ్రిగోల్డ్ వ్యవహారం వరకు పలు అంశాలను వైసిపి లేవనెత్తిన తర్వాత పవన్ రంగంలోకి దిగారు. ఇది వైసిపిని కార్నర్ చేసేందుకా? చంద్రబాబును కాపాడేందుకా? లేక ప్రతిపక్షానికి తోడై చంద్రబాబును ఇరుకున పడేసేందుకా? అనే విషయం అర్థం కావడం లేదంటున్నారు.

మిస్టరీగా మారారా?
పవన్ కళ్యాణ్ ఓ మిస్టరీగా మారిపోయాడని టిడిపి నేత ఒకరు అభిప్రాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2014లో బీజేపీ - టిడిపికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. ఇటీవల వారికి దూరమైనట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా బీజేపీకి దూరమయ్యారు. టిడిపికి దూరమయ్యారా అంటే ఇంకా క్లారిటీ లేదంటున్నారు. అదే సమయంలో ఇటీవల లెఫ్ట్ పార్టీలతో చెట్టాపట్టాల్ వేస్తున్నారు.
2019 నాటికి ఎలా ముందుకెళ్లాలి? ఏం చేయాలి? ఎవరితో కలవాలి? ఇలా.. ఎన్నో అంశాలపై పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉందా? ఆయన అసలు ఎవరి వైపు ఉంటున్నారు? అర్థం కావడం లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందించడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.
ఆయన సమస్యపై స్పందిస్తే.. ప్రభుత్వం నుంచి స్పందన కూడా వస్తోంది. మరో విషయమేమంటే.. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం వచ్చానని చెబుతున్నారు. సమస్యలపై ఆయన స్పందన కూడా అలాగే కనిపిస్తోంది. కానీ ఆయన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని ఇతర పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.
మూడు రోజుల క్రితం కేబినెట్ విస్తరణలో వైసిపి నుంచి గెలిచిన నలుగురికి చోటు కల్పించారు. దీనిపై జనసేన అధినేత స్పందించలేదు. కొన్ని అంశాలపై ఆయన స్పందించకపోవడమో లేక ఆలస్యంగా స్పందించడమో జరుగుతోంది. దీంతో అసలు ఆయన మనసులో ఏముందో అర్థం కావడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications