గులాబ్ తుఫాను బాధితుల కోసం పవన్ కళ్యాణ్ : నామమాత్రపు సాయం వద్దు; పరిహారం డిమాండ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గులాబ్ తుఫాను బీభత్సం పై, గులాబ్ తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తూ ఒక లేఖ రాశారు. గులాబ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు అతలాకుతలమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంవల్ల వేలాది ఇళ్లల్లోకి నీరు ప్రవేశించిందని, దానివల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గులాబ్ తుఫాను సృష్టించిన విధ్వంసం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ తన లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలలో విద్యుత్ సదుపాయం దెబ్బతినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నాం అని వెల్లడించారు . జనసేన నాయకులు శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయ పడాలని కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పంట నష్టపరిహారం లెక్కింపులో అనుసరించే విధానాలు మారాలన్న పవన్
ప్రకృతి విపత్తులకు నష్టపోయే వర్గం రైతాంగమేనని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అప్పులు చేసి కాయకష్టం తో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తింటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గులాబ్ తుఫాను మూలంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లుగా తెలిసిందని ఆయన తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు ఎక్కువ మేర వరి పంట దెబ్బతిందని, పంట నష్టపరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
నామమాత్రపు సాయంతో ప్రయోజనం లేదు ..ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు పరిహారం
నామమాత్రపు సాయంతో సరి పడితే ప్రయోజనం ఉండదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నివర్ తుఫాను సమయంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నా అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలుగుతారని ,ఈ దిశగా ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచన చేయాలని తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బ తిన్న రైతులకు తగిన సహాయం చెయ్యటంలో ప్రభుత్వం శ్రద్ధ వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
జనసైన్యం వరద సహాయక కార్యక్రమాల్లో భాగం తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు గులాబ్ తుఫాను బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయం అందించాలని, ఉత్తరాంధ్ర జిల్లాలలో సహాయ కార్యక్రమాలలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జన సైన్యం వరద సహాయక కార్యక్రమాలలో భాగం తీసుకోవాలని, గులాబ్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సైతం పిలుపునిచ్చారు.
దిశ మార్చుకున్న గులాబ్ .. తాజా పరిస్థితి ఇలా
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల పై గులాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో గులాబ్ తుఫాను కారణంగా పలు గ్రామాలు నీటమునిగాయి. జలాశయాలు ప్రమాదకరస్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక వర్షాలు వరదల కారణంగా అపారమైన పంట నష్టం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే గులాబ్ తుఫాను దిశను మార్చుకున్నట్టు రాత్రికి రాత్రి నుంచి మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల వైపు మళ్ళినట్టు ప్రస్తుతం కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఏది ఏమైనా మరో రెండు మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో తుఫాను ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.