చిరంజీవి వల్ల పవన్ కల్యాణ్ కు మైనస్సా? ప్లస్సా?.. కాపు పెద్దల అభిప్రాయం??
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలియజేశారు. కొన్నాళ్ల నుంచి ఆయన మద్దతు ఉందా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న రాజకీయ వర్గాలకు ఈ ప్రకటనతో స్పష్టత వచ్చినట్లైంది. అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కాలక్రమంలో దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి మద్దతు జనసేనాని పవన్ కల్యాణ్కు ప్లస్సవుతుందా? మైనస్ అవుతుందా? అనే మీమాంస జనసేన వర్గాల్లో వ్యక్తమవుతోంది.
చిరంజీవి ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా ఉంటారు. వ్యాపారవర్గాల అభిప్రాయం ప్రకారం వీరు మంచి భాగస్వాములని చెబుతారు. ఇప్పటివరకు చిరంజీవి మద్దతు ఉందనుకుంటూ వస్తున్న వైసీపీకి చిరంజీవి ప్రకటన షాక్ ఇచ్చినట్లైంది. ఆ ప్రభావం గాడ్ ఫాదర్ సినిమాపై స్వల్పంగా పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ధరకు టికెట్ ధరలు ఉండటంతో వీఆర్వోల ఆధ్వర్యంలో థియేటర్ టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. పవన్ కల్యాణ్ తాను 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికే వచ్చానని, మధ్యలో వదిలి వెళ్లేది లేదని ప్రకటిస్తూ వస్తున్నారు.

ప్రజారాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే వ్యాఖ్యలు చేస్తున్న పవన్
చిరంజీవి ప్రజారాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పార్టీని దీర్ఘకాలికంగా నడపడానికే తాను ప్రాధాన్యతనిస్తానని పదే పదే ప్రకటించడం కూడా చిరంజీవిలా నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశం ఆయన లో ఉంది. కాపు సామాజిక వర్గంలో ఉన్న మంచిపేరును చిరంజీవి పోగొట్టుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా అప్పటినుంచి నడిపించుకుంటూ, ఆటుపోట్లను తట్టుకుంటూ వస్తే జనసేన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, ఈ సమయానికి చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేవారని, దీంతో తమ సామాజికవర్గానికి చిరకాల వాంఛగా మిగిలిపోయిన కోరిక తీరినట్లయ్యేదని కాపు పెద్దలు వ్యాఖ్యానిస్తుండేవారు.

ఇద్దరికీ హస్తిమశకాంతరమంత తేడా
గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలో ఓడిపోవడమే కాకుండా ఒకే ఒక ఎమ్మెల్యే గెలవడంతోపాటు అతి తక్కువ నియోజకవర్గాల్లోనే చెప్పుకోదగిన సంఖ్యలో జనసేన ఓట్లు సాధించగలిగింది. కానీ ప్రజారాజ్యం ఏర్పాటైనప్పుడు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవగలిగిందికానీ చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం పార్టీని నడపడానికి పవన్ కల్యాణ్ సినిమాలు ఎక్కువగా ఒప్పుకుంటున్నారు. వీటిపై వచ్చే ఆదాయంతో పార్టీని నడిపిస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవికి, పవన్ కల్యాణ్కు హస్తిమశకాంతరమంత తేడా కనపడుతోంది.

చిరంజీవి చేసిన గాయం మానలేదు?
వాస్తవానికి చిరంజీవి చేసిన గాయంమానలేదని కాపు పెద్దలు చెబుతుంటారు. గత ఎన్నికల్లో జనసేన ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పటకీ సినిమాల పరంగా చిరంజీవికి అభిమానులున్నారుకానీ రాజకీయంగా అయితే లేరు. పవన్ కల్యాణ్ను సమర్థించేవారి మనస్తత్వం వేరు.. చిరంజీవి గురించి ఆలోచించేవారి మనస్తత్వం వేరు. ఒకవైపు జగన్ ఉండగా.. మరోవైపు చంద్రబాబు ఉన్నారు. ఇద్దరికీ నొప్పి అనిపించకుండా కర్ర విగకుండా పాము చావకుండా అనే రీతిలో చిరంజీవి ప్రకటన చేశారు. ఆ ప్రకటన పవన్ కల్యాణ్కు వరంగా మారి కొన్ని అసెంబ్లీ సీట్లను తెచ్చిపెడుతుందా? లేదంటే మైనస్ గా మారి యథారాజాగానే ఉంటుందా? అనేది కాలమే నిర్ణయించనుంది.












Click it and Unblock the Notifications