అన్నయ్యలా కాదు: మోడీ టీంలో పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి తగిన ఫలితాలు సాధించలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెసులో పార్టీని విలీనం చేసి, రాజ్యసభ సభ్యుడిగా వెళ్లి కేంద్ర మత్రి అయ్యారు. అన్నయ్యలా అంతగా కష్టపడకుండానే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్కు వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్ను ఎన్డీయె ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసి, మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారంతో సీమాంధ్రలో తెలుగుదేశం - బిజెపి కూటమి లాభపడిందని, సీమాంధ్రలో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని గట్టిగా నమ్ముతున్నారు.

పవన్ కళ్యాణ్ను కేంద్రానికి పంపించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఉత్సుకత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా, బిజెపి - తెలుగుదేశం కూటమికి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
నరేంద్ర మోడీ, చంద్రబాబులతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేదికలు పంచుకున్నారు. తాను ఒక్కడు కూడా ఆ కూటమికి ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఎదుర్కోవడంలో పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు, విమర్శలు పనికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ పవన్ కళ్యాణ్కు పదవి ఇచ్చేందుకు మోడీ, చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పదవి తీసుకుంటారా, తనవారికి ఇప్పిస్తారా అనేది ఇప్పుడిప్పుడే తేలే విషయం కాదు. అలాగే, పవన్ కళ్యాణ్కు మోడీ, చంద్రబాబు పదవి ఇస్తామని చెప్పిన మాటలు కూడా ఎంత వరకు నిజమనేది తెలియదు. కానీ, ఆ విషయంపై పుకార్లు మాత్రం విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications