పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర: ముహూర్తం ఖరారు?
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు పూనుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన యాత్రకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి జనసేన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను విశ్లేషిస్తారని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రయాణం ప్రారంభించేందుకు జన సేనాపతి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధితోపాటు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సరిచేసే ప్రయత్నం, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఊపిరి ఆగిపోతున్న ఉద్దానం ప్రజలకు అండగా నిలవాలన్న అజెండాతో సిక్కోల్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా, అమరావతి భూముల వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశ్వాసం పెరిగినట్లు భావిస్తున్నారు. బిజెపికి అనుకూలంగా ఆయన వ్యవహరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో కొనసాగే విషయాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారా ఎపిలో పాగా వేయాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న బిజెపి శ్రేణులు పవన్ కళ్యాణ్ రూపంలో వస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమలంతో జనసేన కలిసి ఏపీలో పోటీకి దిగేందుకు బీజం శ్రీకాకుళం నుంచే నాటేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి.













Click it and Unblock the Notifications