లేవండి! మేల్కొండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి!!
సినిమా విడుదలైతే తండోప తండాలుగా థియేటర్లకు అభిమానులు తరలివస్తారు. సినిమాలన్నీ రికార్డులు సృష్టిస్తాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ కథానాయకుణ్ని చూస్తే అందరికీ అసూయ. ఎందుకంటే అంతమంది అభిమానులున్నారే.. తమకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. ఆ కథానాయకుడెవరంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
అభిమానులు పవన్ కు కూడా ఓటేయలేదు?
అటువంటి కథానాయకుడు ఎన్నికల్లో నిలబడితే ఓట్లు గుంపగుత్తగా రాలి ఈవీఎంల్లో పడాలి. భారీ మెజారిటీతో విజయం సాధించాలి. కానీ ఈ రెండూ జరగలేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకే కాదు, పవన్ కల్యాణ్ కు కూడా అభిమానులు ఓటేయలేదని స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో తాము పవన్ అన్న అభిమానులమే.. ఓటు మాత్రం జగనన్నకు వేశామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు. జనసేన రాజకీయ శక్తిగా మారాలంటే తనకున్న అభిమాన గణమంతా ఓటర్లుగా రూపాంతరం చెందాలనే విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించారు.
ఓటు వేయాలేదంటూ అభిమానులకు గుర్తుచేస్తున్న పవన్
యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు పవన్. ఆయన తర్వాత ఇతర రాజకీయ పార్టీలు నిలుస్తాయి. అంతటి ఫాలోయింగ్ మొత్తాన్ని ఈసారి ఎన్నికలకు ఓటర్లుగా మార్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలికాలంలో పాల్గొన్న పలు కార్యక్రమాల్లో అరుపులు, విజిల్స్ వేసి ఉపయోగమేంటని, ఓటు వేయలేదుకదా అంటూ అభిమానులకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు. యువ శక్తిని సరిగా వినియోగించుకుంటే అధికారం సులువని పవన్ గ్రహించారు.
జనవరి 12న రణస్థలంలో..
అందుకనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువభేరీ నిర్వహించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను ముందుగా సభకు పిలిపించాలనుకున్నప్పటికీ తర్వాత మనసు మార్చుకొని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని యువతను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సభావేదికను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కూడా రణస్థలం వచ్చి యువభేరీ జరిగే సభా ప్రాంగణాన్ని పరిశీలించబోతున్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. అలాగే యువతలో అత్యధిక అభిమానులున్న పవన్ కల్యాణ్ జనసేన కూడా రాజకీయ శక్తిగా ఎదగాలంటే వారు తలుచుకుంటే చాలు.