పవన్ కళ్యాణ్, జూ. ఎన్టీఆర్, లోకేష్: 2019 టార్గెట్?
హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీమాంధ్ర రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు రావచ్చునని భావిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అంతగా దాని ప్రభావం ఉండకపోవచ్చు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో జాతీయ పార్టీ కాంగ్రెసు తలపడుతుండగా, సీమాంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోయి, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొందనే అంచనాలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే ఒక రకంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తే మరో రకంగా సమీకరణాలు మారే అవకాశం ఉంది.
సీమాంధ్రలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే, జూనియర్ ఎన్టీఆర్కు అంతగా అవకాశం ఉండకపోవచ్చునని చెబుతున్నారు. అప్పుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ లేదా నందమూరి హీరో బాలకృష్ణ ముందుకు రావచ్చునని భావిస్తున్నారు. టిడిపి అపజయం పాలైతే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగవచ్చునని అంటున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దిగుతుందని ఇప్పటికే చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే అవకాశాలున్నాయి. జనసేనతో స్నేహాన్ని కొనసాగించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కానీ, ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి వీలు లేకుండా ఉంది. నారా లోకేష్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ పార్టీకి ప్రచారం సాగించారు. మెల్లగా పార్టీని చంద్రబాబు చేతుల్లోంచి ఆయన తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అందుకు చంద్రబాబు కూడా వెలుసుబాటు కల్పించే అవకాశాలున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ జోరుగా రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. తెలుగుదేశం విజయం సాధిస్తే, లోలోపల తన యంత్రాంగ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతారని అంటున్నారు. సినిమా రంగంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ జోరు మీద ఉన్నారు. మరో ఐదేళ్లలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయనేది చెప్పడానికి వీలు కాదు గానీ వారిద్దరి ప్రణాళిక మాత్రం 2019 ఎన్నికల మీద ఉన్నట్లు చెబుతున్నారు.