ఆ ఘటన పట్ల విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. సోమవారం నాడే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించడానికి 1,005 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 1,069 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పవన్ కల్యాణ్ విశాఖపట్నానికి వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపివేయడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఉదయం 8:30 నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లాల్సొచ్చింది.

నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉండటం వల్ల ఆ విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. దీనితో కొందరు విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకోవడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాయలేకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పెందుర్తి ప్రాంతంలో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోవడానికి తన కాన్వాయ్ కారణమంటూ వచ్చిన వార్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని అన్నారు.
కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ను నిలిపివేశారు?, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని స్పష్టంగా చెబుతూ ఉంటారని, కూటమి ప్రభుత్వంలో వీఐపీ పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలనే పోలీసులకు ఆదేశాలు ఉన్నాయని డీప్యూటీ సీఎంఓ గుర్తు చేసింది. ప్రజా ప్రతినిధుల వల్ల ట్రాఫిక్కు అడ్డంకులు కలిగించే చర్యలు చేపట్టకూడదంటూ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది.
దీనికి అనుగుణంగానే ప్రతీ పర్యటన సందర్భంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేస్తుంటామని వివరించింది. ఈ పర్యటనలో కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు అదే క్రమశిక్షణను పాటించారని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సైరన్ కూతలనూ సైతం తగ్గించి ప్రయాణిస్తుంటారని పేర్కొంది.












Click it and Unblock the Notifications