ద్రవిడ సంస్కృతిపై దాడి: జల్లికట్టుపై పవన్.. వ్యవసాయ క్షేత్రంలో ఇలా..
జల్లికట్టుపై కేంద్రం తీరును తప్పుబట్టిన పవన్ కళ్యాణ్.. దీనిపై నిషేధం కొనసాగించడాన్ని ద్రావిడ సంస్కృతి, సమగ్రతపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.
చెన్నై: సినీ-రాజకీయాలకు అతీతంగా జల్లికట్టుపై తమిళ జనమంతా ఒక్క తాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్, రజనీ, ప్రభుదేవా, వంటి ప్రముఖులు మెరీనా బీచ్ వేదికగా జల్లికట్టుకు మద్దతుగా నిలబడటంతో.. వేలాది జనం అక్కడికి తరలివచ్చి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు.
తాజాగా తెలుగు ప్రముఖులు కూడా జల్లికట్టుకు మద్దతుగా తమ స్పందన తెలియజేస్తుండటం గమనార్హం. సామాజిక విషయాలపై ఎన్నడూ స్పందించని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జల్లికట్టుపై స్పందించడం విశేషం. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జల్లికట్టుపై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ద్రవిడ సంస్కృతి మీద దాడే:
జల్లికట్టుపై కేంద్రం తీరును తప్పుబట్టిన పవన్ కళ్యాణ్.. దీనిపై నిషేధం కొనసాగించడాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. తమిళనాడులో సినిమా చిత్రీకరణ సమయంలో దక్షిణ భారతాన్ని ఎలా అణచివేస్తున్నారో చూశానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
దక్షిణ భారతం పట్ల చిన్నచూపు:
గతేడాది నుంచి జనసేనను యాక్టివ్ చేసిన పవన్ కళ్యాణ్ సామాజిక అంశాల మీద విరివిగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జల్లికట్టు, కోడిపందేలపై ఆయన స్పందించారు.
దక్షిణ భారత దేశం పట్ల కేంద్రానికి ఉన్న దృష్టిని ఈ చర్య తేటతెల్లం చేస్తోందని అభిప్రాయపడ్డారు పవన్. జల్లికట్టుతో పాటు కోడిపందేల నిర్వహణకు కూడా పవన్ మద్దతు తెలపడం గమనార్హం.
పవన్ గోశాలలో 16 ఆవులు:
అదే సమయంలో భారతీయ సంస్కృతి, పశుసంపద అయిన ఆవులు, మాతృభూమిపై తనకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. తన గోశాలలో 16 ఆవులు ఉన్నాయని తెలిపారు. కాగా, సినిమాలు చేసుకోవడం కన్నా.. వ్యవసాయం చేస్తూ జీవించడమే తనకు ఇష్టమని పవన్ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
అందుకు అనుగుణంగానే సినిమా షూటింగ్స్ లో కాస్త ఖాళీ దొరకగానే ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోని వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసుకుంటున్న ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
జీవామృతంతో వ్యవసాయం:
సాంప్రదాయిక వ్యవసాయ పద్దతులకు జీవామృతాన్ని జోడించి తన పొలంలో వ్యవసాయాన్ని సాగుచేస్తున్నానని పవన్ తెలియజేశారు. వ్యవసాయంలో అవలంభించే విధానాలను తెలుసుకోవడం కోసం పవన్ పుస్తకాలను కూడా విరివిగా చదువుతారు.
దేశీ వంగడాలు:
తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటుతున్న ఫోటో ఒకటి పవన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. తనకు పాలేకర్ వ్యవసాయ విధానాలను పరిచయం చేసిన శ్రీ విజయ రామారావుతో కలిసి దేశీ వంగడాలను నాటుతున్నట్టుగా పేర్కొన్నారు.