లెక్కలేకుండా పోయింది, ఏమైనా అంటే నాపై అలా ప్రచారం: పవన్ కళ్యాణ్
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా పరిశ్రమలో జరిగిన విషాదంపై జనసేన అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా పరిశ్రమలో జరిగిన విషాదంపై జనసేన అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించకుండా పరిశ్రమలు నిర్వహిస్తుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి తాను మాట్లాడుతుంటే, తాను వాటికి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి చెప్పిన వాటిని ఎవరూ పాటించకపోవడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అవి వెదజల్లే కాలుష్యానికి మాత్రం వ్యతిరేకమన్నారు. ప్రమాణాలు పాటించని పరిశ్రమల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న ఇటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు రోడ్డున పడకుండా, న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఇటువంటి పరిశ్రమలకు లైసెన్సులు క్యాన్సిల్ చేయాలన్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రాణాలు తీస్తోన్న పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చేయడం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి శాఖల బాధ్యత అని, అధికారులు జీతాలు తీసుకుంటున్నప్పుడు సరిగ్గా పని చేయాలని చెప్పారు. ప్రజల ప్రాణాలు అంటే ఎవరికీ లెక్కలేకుండా పోయిందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి పని చేయాలన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో గురువారం విషవాయువు పీల్చి అయిదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.