టీఆర్ఎస్లో మద్దతుదారులు! తెలంగాణ ఎన్నికల్లో పోటీపై పవన్, జనసేనలో చేరికపై నాదెండ్ల
అమరావతి: తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదని, అయితే, అక్కడి ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో ఎన్నికలు వచ్చాయని అన్నారు పవన్ కళ్యాణ్. అమరావతిలో జనసేన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

మద్దతుదారులంతా టీఆర్ఎస్లో
2019లోనే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని తాము భావించామని చెప్పారు. 2009లోనే తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తాను పర్యటించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో తమకు మద్దతిచ్చేవారంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నారని, తాము పోటీ చేస్తామంటే మద్దతుగా ఉంటామని వారు చెబుతున్నారని పవన్ తెలిపారు.

23-24స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం.. కానీ
2019లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 23-24స్థానాల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే, ముందస్తుకు పోవడంతో పోటీపై ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. నాలుగైదు రోజుల్లో పోటీ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెబుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అమరావతిలో కార్యాలయం మంచి నిర్ణయం
ఇది ఇలా ఉండగా, అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇక్కడ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని అన్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

పవన్ ఎప్పట్నుంచో మంచి మిత్రుడు
పవన్, తాను ఎప్పట్నుంచో మిత్రులమని నాదెండ్ల మనోహర్ చెప్పారు. పట్టుదల, నిజాయితీతో ప్రజా సమస్యలపై పోరాటానికి ఎంతదూరమైనా పవన్ వెళతారని ఆయన తెలిపారు. రాజకీయాల్లో మార్పు, ప్రజల కోసం సేవా చేయాలనే దృఢ సంకల్పంతోనే తాను జనసేనలో చేరినట్లు తెలిపారు.

ఇంటింటికీ జనసేన
తాము మోసం చేయమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, తెలుగు ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని అన్నారు. ప్రజల ముందుకు వచ్చిన తమను ఆశీర్వదించాలని కోరారు.
జనసేన ఆశయాలను, మేనిఫెస్టోను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications