'గ్రాఫ్ పడిపోతుందని ఆలోచనలోపడ్డ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సర్వే'
అమరావతి: బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదివారం అన్నారు. నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడాను కూడా ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ అయితే నిర్ణయాన్ని తొందరగా తీసుకుంటారని, చంద్రబాబు అయితే ఆలోచిస్తారని చెప్పారు. అందరూ మన మనుషులే, మనతో ఉన్నారు.. నచ్చ చెప్పాలని చంద్రబాబు చూస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది మంచితనమని, ఆయన చాలామందితో చనువుగా ఉంటారన్నారు.
బీజేపీ - వైసీపీ కలిసి ఉన్నాయి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కంట్రోల్లో ఉన్నారని చినరాజప్ప అన్నారు. బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పడానికి చాలా సంఘటనలు నిదర్శనంగా ఉన్నాయని చెప్పారు.
Recommended Video
గ్రాఫ్ పడిపోతుందని తెలిసి, పవన్ ఆలోచనలో పడ్డారు
ఇటీవల పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో వెళ్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా చినరాజప్ప స్పందించారు. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని తెలిసి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో పడ్డారని చెప్పారు. బీజేపీతో వెళ్తే తాను కూడా మునిగిపోతానని భావించారని, ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.
చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారని చినరాజప్ప చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు ఆరా తీస్తున్నారన్నారు. సర్వేకు అనుగుణంగా ఆయన టిక్కెట్లపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
వామపక్షాలు ఆనాడే హెచ్చరించాయి
ఏపీకి బీజేపీ నమ్మకద్రోహం చేసిందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విభజన హామీలు నెరవేరిస్తే టీడీపీ బలపడుతుందని బీజేపీ భయపడుతోందన్నారు. బీజేపీని నమ్మవద్దని వామపక్షాలు ముందే హెచ్చరించాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను విశాఖ రైల్వే జోన్ సాధించుకుంటామన్నారు.