రెండేళ్ల ముందే పవన్ మ్యానిఫెస్టో-అసలు ప్లాన్ ఇదే - జగన్ బాటలోనే మైండ్ గేమ్?
ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల గడువున్నా అప్పుడే రాజకీయం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో నానాటికీ బలపడుతున్న వైసీపీని అడ్డుకునేందుకు విపక్షాలు ముందుగానే రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికల ప్రకటనలు కూడా చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా మ్యానిఫెస్టోప్రకటనల వరకూ వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరో అడుగు ముందుకేశారు.
Recommended Video

పవన్ మ్యానిఫెస్టో ప్రకటన
ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఆ మేరకు తాను అధికారంలోకి వస్తే చేసే పనుల్ని కూడా చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్నే పునాదులుగా మార్చుకుంటూ తనకు అధికారం అప్పగిస్తే రాష్ట్రంలో ఏయే వర్గాలకు ఏమేం చేస్తారో చెప్పేశారు. ఇందులో ఉద్యోగులు, సామాన్యులు, వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా ప్రతీ ఒక్కరి కోణంలో ఈ మ్యానిఫెస్టోలో ఏదో ఒక అంశం ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా జగన్ సర్కార్ అమలు చేయలేని ప్రతీ హామీని ఇందులో పవన్ చొప్పించేశారు.

రెండేళ్ల ముందే మ్యానిఫెస్టో
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు మాత్రమే పూర్తయింది. మరో రెండేళ్ల పాటు ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది. జగన్ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే తప్ప 2024 వరకూ ఎన్నికలు కూడా లేవు. అయినా జనసేన పార్టీ అధినేత పవన్ తామ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇచ్చేశారు. మ్యానిఫెస్టో అన్న ఒక్క పదం మాత్రమే వాడలేదు. మిగతా ప్రకటన అంతా చేసేశారు. దీంతో రెండేళ్ల ముందే మ్యానిఫెస్టో ప్రకటన ద్వారా పవన్ ఏం ఆశిస్తున్నారన్న చర్చ మొదలైంది.

మైండ్ గేమ్ స్టార్ట్?
ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టో పేరు చెప్పకుండానే ప్రకటించిన అంశాల్ని చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయాల తీరు ఏ విధంగా మారుతోందో కూడా అర్ధమవుతోంది. ముఖ్యంగా ఈ రెండేళ్లలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరగాలన్న ఆలోచనతోనే పవన్ ఇలా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి అధికార వైసీపీపై ఇప్పటి నుంచే మైండ్ గేమ్ మొదలుపెట్టడం ద్వారా తాను మాటల మనిషిని కాదని నిరూపించుకునేందుకే పవన్ ఈ ప్రకటన చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

జగన్ బాటలోనే పవన్?
గతంలో విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కూడా అప్పటి సీఎం చంద్రబాబుపై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించే వారు. ఇదే క్రమంలో జగన్ కూడా ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల్ని దాదాపు ఏడాది ముందుగానే విడుదల చేసేశారు. అంతే కాదు వాటిని ఇంటింటికీ వైసీపీ పేరుతో జనంలోకి తీసుకెళ్లేలా తన క్యాడర్ ను ప్రోత్సహించారు. ఇందులో ఎక్కడా తేడా రాకుండా చూసుకున్నారు. చివరికి ఆ ప్లాన్ విజయవంతమైంది.
జనంలోకి వైసీపీ మ్యానిఫెస్టో ముందుగానే వెళ్లిపోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో పేరుతో ఓ రెండు పేజీల్ని విడుదల చేయడం ద్వారా జగన్ భారీగా లబ్ది పొందారు. ఇప్పుడు పవన్ కూడా అచ్చంగా అదే తరహాలో వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications