మోడీ సభకు అందుకే వెళ్లలేదు-షాకింగ్ రీజన్ చెప్పిన పవన్-రఘురామకు స్నేహహస్తం ?
ఏపీలో ప్రధాని మోడీ ఈ నెల 4న భీమవరం టూర్ కు వచ్చారు. ఈ టూర్ ఏపీ రాజకీయాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే ప్రధాని మోడీ పర్యటనకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరంగా ఉండిపోయారు. తన గైర్హాజరుపై గతంలో పవన్ స్పందించినా కారణాలు మాత్రం చెప్పిలేదు. కానీ తాజాగా భీమవరం టూర్ కు వెళ్లిన పవన్.. అక్కడ మాత్రం అసలు కారణం వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమవుతోంది.

మోడీ టూర్ కు పవన్ దూరం
ఏపీలో ప్రధాని మోడీ భీమవరం టూర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరంగా ఉండిపోయారు. స్వయంగా కేంద్రం ఆహ్వానించినా వెళ్లలేదు. తన అన్న చిరంజీవితో సైతం వేదిక పంచుకుంటారని భావించినా అలా చేయలేదు. చివరి నిమిషం వరకూ సైలెంట్ గా ఉండి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే ఓ వీడియో విడుదల చేసి పవన్ మిన్నకుండిపోయారు. ఇందులోనూ తాను ఎందుకు హాజరుకావడం లేదో స్పష్టంగా చెప్పలేదు. దీంతో జగన్ తో వేదిక పంచుకోవడం ఇష్టం లేకో, తన పాతమిత్రుడు చంద్రబాబును ఆహ్వానించలేదనో పవన్ రాలేదని అంతా భావించారు.

అసలు కారణమిదేనట
ప్రధాని మోడీ భీమవరం టూర్ కు తాను దూరంగా ఉండిపోవడం వెనుక అసలు కారణాన్ని పవన్ కళ్యాణ్.. తాజాగా బయటపెట్టారు. అదీ భీమవరం వెళ్లి మరీ అక్కడి ప్రజల ముందే ఈ కారణాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ టూర్ కు తాను ఊరికే దూరం కాలేదని, దాని వెనుక జరిగింది ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ కారణం పేర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పిన కారణం నిజమే అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి ఇదే నిదర్శనంగా అక్కడి జనం చెవులు కొరుక్కుంటున్నారు. అదే సమయంలో మోడీ టూర్ కు రాలేకపోయిన స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు హ్యాపీ ఫీలవుతున్నారు.

రఘురామను రానివ్వనందుకే
భీమవరంలో ప్రధాని మోడీ టూర్ కు తనకు ఆహ్వనం అందినా స్ధానిక ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుకు మాత్రం ఆహ్వనం అందలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. స్ధానిక ఎంపీకి ఆహ్వానం లేనప్పుడు తాను అక్కడికి వెళ్లడం సరికాదని భావించినట్లు పవన్ స్పష్టం చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజును ఉద్దేశవూర్వకంగా దూరం చేసిన వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగానే పవన్ ఈ టూర్ కు దూరంగా ఉండిపోయినట్లు చెప్పుకొచ్చారు. అయితే రాజలు, కాపుల మధ్య పోరు ఉండే భీమవరంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్ధానిక రాజకీయాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

రఘురామకు పవన్ స్నేహహస్తం ?
కాపులు, రాజులకూ మధ్య పోరు సాగే భీమవరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో రాజులు పవన్ కు సహకరించకపోవడం వల్లే ఓడిపోయారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో తన అభిమానులు కూడా ప్రభాస్ అభిమానులతో నిత్యం రణం సాగిస్తుంటారు. కానీ తాజాగా పవన్ రఘురామరాజుకు అండగా తాను కూడా ప్రధాని టూర్ కు దూరంగా ఉన్నానని చెప్పడంతో ఈ రెండు వర్గాల మధ్య పోరుకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. పవన్ చాచిన స్నేహహస్తాన్ని రఘరామరాజు అందుకుంటే ఈ ప్రాంతంలో రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications