పవన్ మెదక్ రాకున్నా: బాబు షో, వెంకయ్య ప్రచారం?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెదక్ లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేసే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థికి ప్రచారం చేయకపోయినప్పటికీ జగ్గారెడ్డి విజయం ఖాయమని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డిలను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్నికలు సెప్టెంబర్ 13వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుండి ప్రచారం కోసం తమకు పది రోజులు ఉంటుందని, ఏడు రోజుల్లో తమ అభ్యర్థి జగ్గారెడ్డి ఏడు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తారని, మిగతా మూడు రోజుల్లో భారీ సభలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలలో భారీ ర్యాలీలు, సభలు ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో తాము కేంద్ర నాయకులతోను టచ్లో ఉన్నట్లు స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.
కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయవచ్చునని చెబుతున్నారు. చివరి మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్న మూడు భారీ ర్యాలీలు, సభల్లో ఏదో ఒక సభకు జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగ్గారెడ్డి వర్గీయులు పవన్ కళ్యాణ్ను చివరి వరకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా... టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని సమాచారం. బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం చేయనుంది. విభజన నేపథ్యంలో చంద్రబాబు వస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. అయితే, చంద్రబాబు రోడ్డు షోలలో పాల్గొనవచ్చునని భావిస్తున్నారు.