ఒక్కసీటు ఎఫెక్ట్: పొట్లూరి బెజవాడకోసం పవన్ దూకుడు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ కోసం దూకుడుగా వెళ్తున్నారనే వాదన వినిపిస్తోంది. పవన్ జనసేన పార్టీని పొట్లూరి ఒత్తిడతోనే స్థాపించినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. విజయవాడ లోకసభ టిక్కెట్ ఆశించిన పొట్లూరి... తొలుత వైయస్సార్ కాంగ్రెసు, తర్వాత టిడిపిలలో ప్రయత్నాలు చేశారని, ఆ రెండు పార్టీలలో టిక్కెట్ లభించక పోవడంతో పవన్తో పార్టీ పెట్టించారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు అదే పొట్లూరి కోసం పవన్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడుతున్నారని అంటున్నారు. పవన్ టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా నిలబడ్డారు. ఆ పార్టీల తరఫున ప్రచారం కోసం కూడా ముందుకు వచ్చారు. అయితే, పొట్లూరికి టిక్కెట్ ఇవ్వాలని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అడిగారట. అప్పటికే కేశినేని నానిని టిడిపి తరఫున నిర్ణయించారు. కేశినేని కూడా ప్రచారం చేశారు.
ఈ సమయంలో పొట్లూరి కోసం పవన్ లాబియింగ్ చేశారంటున్నారు. దీనిపై చంద్రబాబు తీవ్ర తర్జన భర్జనకు గురయ్యారు. తర్జన భర్జన అనంతరం మంగళవారం చంద్రబాబు కేశినేని నాని వైపే మొగ్గారు. తాను మద్దతిస్తున్నప్పటికీ తాను కోరిన ఒక్క సీటును కేటాయించక పోవడం పవన్కు ఆగ్రహం, అసహనం తెప్పించిందంటున్నారు. ఈ కారణంగానే తాను అభ్యర్థులను బరిలో దింపాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓటు చీలవద్దనే తన పార్టీ తరఫున పోటీ చేయడం లేదని పవన్ చెప్పారు. అయితే పొట్లూరి కోసం ఇప్పుడు విజయవాడ లోకసభతో పాటు మరో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను స్వతంత్రంగా నిలబెట్టనున్నారట. పొట్లూరి, మిగతా ఆరుగురు శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది.