Pawan Kalyan : రౌడీసేన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ ట్వీట్ కౌంటర్ - వైఎస్ జగన్ పై సెటైర్ !
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ పై తాజాగా సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేనను రౌడీసేనగా అభివర్ణించారు. విపక్షాలు బూతు పంచాంగం అందుకుంటున్నాయని విమర్శలు చేశారు. దీనిపై జనసేన నేతలు రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ట్వీట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రౌడీ సేన అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇవాళ ఓ కార్టూన్ పెట్టి ట్వీట్ చేశారు. ఈ కార్టూన్ ట్వీట్ లో పలు డైలాగులు దర్శనమిస్తున్నాయి. వైసీపీ సర్కార్ రాష్ట్రంలో జనాన్ని బెదిరిస్తున్నట్లు, లూటీలు చేస్తున్నట్లు, జనం హాహాకారాలు చేస్తున్నట్లు ఇలా పలు అంశాల్ని ఇందులో కనిపించేలా ఈ కార్టూన్ డిజైన్ చేశారు. ఈ కార్టూన్ ను పవన్ కళ్యాణ్ ట్వీట్ గా పెట్టారు. అంతటికే ఆగకుండా కింద మరో డైలాగ్ కూడా పెట్టారు.
"ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి ప్రత్యర్ధి పార్టీని రౌడీ సేన అని దూషించిన జగన్ " అంటూ ఓ కామెంట్ ను కార్టూన్ కింద కలిపి పవన్ పోస్టు చేశారు. తద్వారా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తాను స్వయంగా అక్రమాలకు పాల్పడుతూ, రౌడీయిజం చేస్తూ విపక్ష పార్టీ అయిన జనసేను రౌడీ సేనగా పేర్కొనడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలుపుతున్నట్లుగా ఈ ట్వీట్ చూస్తే అర్ధమవుతోంది. జగన్ కామెంట్స్ చేసిన రెండు రోజులకు పవన్ పెట్టిన ఈ ట్వీట్ ను ఇప్పుడు జనసేన శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
— Pawan Kalyan (@PawanKalyan) November 22, 2022