జనంలోకి పవన్ కళ్యాణ్: 2019 లక్ష్యంగా యాత్రలు, ఒంటరిగానే?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జనసేన పార్టీని ప్రకటించిన సమయంలో.. పవన్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయితే, తన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్... వరుసగా పలు టీవీ ఛానెళ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు గమనించినట్లయితే 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పవన్ ముందుకు సాగనున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై పవన్ కాస్తంత పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నా.. ఆయన శిబిరం మాత్రం తెర వెనుక భారీ కసరత్తే చేస్తోందట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ జనంలోకి రానున్నారట. ఈ మేరకు పాద యాత్ర కానీ, బస్సు యాత్ర కానీ చేపడతారని తెలుస్తోంది.
జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్రలు సాగనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే గాక, ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ పక్కాగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పాదయాత్రలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలను వేదికలుగా చేసుకుని వాటి ద్వారానే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన భారీ కసరత్తు చేస్తోందన్న వార్తలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. పవన్ జనంలోకి వచ్చి మిత్ర పక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను కలుపుకు పోతారా? లేక తన పార్టీపైనే ప్రత్యేక దృష్టి సారిస్తారా? అనేది వేచి చూడాలి.