కడప క్వారీలో పేలుడులో 10 మంది మృతి తన హృదయాన్ని కలచివేసిందన్న పవన్ కళ్యాణ్
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి శివారు ప్రాంతంలో ఉన్న ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు సంభవించి పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఘటనా స్థలంలో మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ,టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించగా తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
ముగ్గురాయి గనుల్లో జిలెటిన్ స్టిక్స్ పేలి పదిమంది చనిపోయారన్న వార్త తన హృదయాన్ని కలచి వేసిందని పేర్కొన్నారు.ఇది ఎంతో విషాదకరమైన ఘటన అని,ఈ ఘటనలో చనిపోయిన వారిని గుర్తించలేని పరిస్థితి ఉందంటే ఘటన తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.మామిళ్లపల్లె దుర్ఘటన చోటుచేసుకున్న ముగ్గురాయి గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా,కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. పేలుడు ఘటనలలో సామాన్యులు చనిపోతున్నా యజమానులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
2018లో కర్నూలు జిల్లా హత్తిబెళగల్ లో ఇదే తరహాలో ఒక గనిలో పేలుడు జరిగి 12 మంది చనిపోయారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం కార్మికుల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.తాజా ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గనుల వద్ద రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వం విచారణ చేయించాలని, ప్రజల ప్రాణాలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.