లోకేష్ గురించి చెప్పేదేముంది, సీఎం కొడుకు.. అంతా వాళ్లిష్టం: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో ప్రసంగిస్తుండగా మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడాలని జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ సెటైరిక్గా మాట్లాడారు. లోకేష్ గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించారు.
ఆయన ఎవరో మీ అందరికీ తెలుసునని, ముఖ్యమంత్రి గారి కొడుకు అని, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నారు. ప్రభుత్వం, ఖజానా, తాళాలు అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నాయన్నారు. అంతా వాళ్లిష్టమని, వాళ్లేమైనా చేసుకోనీ అన్నారు.

హోదా కోసమే టీడీపీకి మద్దతిచ్చానని, చట్టసభల్లో చెప్పేవి పాటిస్తారని త్రికరణ శుద్ధిగా నమ్మానని, కానీ, ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా రాలేదని, ఇక్కడ డ్రైనేజీ సమస్య అలాగే ఉందని పవన్ అన్నారు.
ఉద్దానంలో కిడ్నీ సమస్య అలాగే ఉందన్నారు. హార్వర్డ్ నుంచి నేను వైద్యులను తీసుకొస్తే, ప్రభుత్వం కొంచెం మాత్రమే కదలిక వచ్చిందని, సమస్యలపై పోరాడుతున్న జనసేన కార్యకర్తలను బెదిరించి, వారి కుటుంబ సభ్యులకు పింఛన్లు ఆపేశారన్నారు. మీరు కేసులు పెట్టినా, వేధించినా ఊరుకునే వ్యక్తులం మాత్రం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
అణగదొక్కుతామంటే ఉవ్వెతున్న సునామీ కెరటంలా పైకి లేస్తామని, బెదిరిస్తే చేతులు కట్టుకొని కూర్చొనే వ్యక్తులం కాదని, ఎదురుదాడి చేస్తామన్నారు. ఎంతో అనుభవమున్న నాయకులు అని చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వారి నుంచి పదవి కోరుకోలేదని, కనీసం జనసేన కార్యకర్తలపై దాడిని ఆపమని కోరానని, మద్దతు తెలిపినందుకు జీవితాంతం బానిసల్లా ఉండాలా? పుష్కరాలు, విదేశీ యాత్రల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications