ఎన్టీఆర్లాగా ఉప్పెన...చిరంజీవిలాగా ప్రవాహంలేదు;ఎదురీదుతూ పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్
పశ్చిమగోదావరి:తాను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీఆర్లా ఉప్పెన లేదని, తన సోదరుడు చిరంజీవిలా ప్రవాహమూ లేదని...ఎదురీదుతూ పార్టీ పెట్టానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తనకు శత్రువు కాదని, తనకు శత్రువులెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కులాన్ని, వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని పవన్ పునరుద్ఘాటించారు. కొందరు భావిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ తనకు శత్రువు కాదని, తనకు శత్రువులెవరూ లేరని ఆయన తేల్చేశారు. అలాగే రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని తాను పట్టించుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేనలో...చేరికలు
పోలవరంలో ఆయన సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్ రావు, పాముల రాజేశ్వరిలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...జనసేన సిద్ధాంతాలను అర్ధం చేసుకుని పార్టీలో చేరడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి కమిటీలు పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు.
ప్రజల కోసమే...జనసేన
రాష్ట్రంలో బలమైన, సుపరిపాలన కోసమే ఆనాడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే మోసాలు చేస్తే ఊరుకోనన్నారు. జనసేన పార్టీని తన కోసం పెట్టలేదని, ప్రజలకు మేలు చేయాలనే పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తూ జనసేన పాలనలోకి రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దూసుకొచ్చిన ...యువకుడు
అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో పవన్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఘటన ఆయన భద్రతపై మరోసారి సందేహాలకు తావిచ్చింది. ఓ యువకుడు హఠాత్తుగా పవన్ కల్యాణ్ కారుపైకి దూసుకురావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. దీనిపై స్పందించిన పవన్ అభిమానులు తమ నేతకు కల్పిస్తున్న భద్రత ఇదేనా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
భద్రతపై...సందేహాలు
పవన్ కల్యాణ్ నిడదవోలు పట్టణంలోకి చేరుకోగానే కార్యకర్తలు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో పవన్ కల్యాణ్ కారులోంచి పైకి లేచి జనాలకు అభివాదం చేయడానికి ఉద్యక్తులవుతుండగా ఆ ఎదురు గుంపులోనుంచి ఒక యువకుడు కారు ముందు భాగంపైకి దూసుకువచ్చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఉలిక్కిపడగా పవన్ వెంటనే మళ్లీ కారులో కిందకు కుర్చుండి పోయారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది తేరుకుని కారుపై ఉన్న యువకుడ్ని కిందకు దింపేశారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ మళ్లీ కారులోంచి పైకి వచ్చి కారు దిగకుండానే అందరికీ అభివాదం చేసుకుంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు.