2019 ఎన్నికలు పవన్ కల్యాణ్కు సీరియస్: ఎవరికి ఎసరు?
హైదరాబాద్: తనకు ఇంకా నటించాలని ఉందని, అయితే 2019 ఎన్నికలను మాత్రం సీరియస్గా తీసుకుంటానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. తమ తండ్రికి వామపక్ష భావజాలం ఉండేదని, తనకు పూర్తిగా ఆ భావజాలం లేదని ఆయన చెప్పారు.
అయితే, మధ్యే మార్గం తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సర్దార్ గబ్బర్సింగ్ త్వరలో కానున్న నేపథ్యంలో ఆయన తన స్టార్ డమ్పై ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోటీ చేసే అవకాశం ఉంది.
అయితే, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా, స్వతంత్రంగా తన పార్టీని పోటీకి దించుతారా అనేది తేలడం లేదు. ఎన్నికలకు మరో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలపై ఇప్పటి నుంచే చర్చ ప్రారంభమైంది. ఆయన ఎవరికి ఎసరు పెడుతారనే విషయంపై కూడా చర్చ సాగుతోంది.
ఇదిలావుంటే, తనకు అభిమానులు ఇచ్చిన స్టార్ డమ్ మోయలేని భారంగా మారిందని చెప్పారు. డో డర్ గయా - వో మర్ గయా అనేది తన లైఫ్ లైన్ అని చెప్పారు. తాను ఇంకా మంచి నటుడిని కాలేదని, అయినా అభిమానుల కోసం నటించాల్సి వస్తోందని చెప్పారు. తాను అనుకోకుండా హీరోగా మారిన నటుడినని చెప్పారు.
సినిమాల్లో ఎలా ఉన్నా బయట సాదాసీదాగా గడపడం ఇష్టమని, ఫామ్హౌస్లో పొలం పనులు చేసుకుంటూ పుస్తకాలు చదువుకోవడం ఇష్టమని చెప్పారు. అన్నయ్య చిరంజీవి వల్ల తాను సినిమాల్లోకి వచ్చాను గానీ నటుడిని కావాలనే కోరిక తనకు ఏ రోజు కూడా లేదని చెప్పారు.