అవాక్కయిన డిప్యూటీ సీఎం పవన్ ? రూ.2092 కోట్లు రూ.7 కోట్లు కావడంతో...
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం సలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి పాలనపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ స్వచ్చాంధ్ర కార్పోరేషన్ వ్యవహారంపై అధికారులతో చర్చించారు.ముఖ్యంగా నాలుగేళ్ల క్రితం 2 వేల కోట్లుగా ఉన్న స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ నిధి కాస్తా ఇప్పుడు 7 కోట్లే ఉండటంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విస్మయం చెందారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై పవన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు.

2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని, 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని పవన్ అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వాడకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications