నాగబాబుకు పవన్ భారీ షాక్.. గాడ్సే కామెంట్స్ పై ఏమన్నాడో తెలుసా ?
జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు మద్దతుగా సోదరుడు, జనసేన నేత, టాలీవుడ్ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గాడ్సే వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా, బయటి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఇది చివరికి మెగా కుటుంబానికి సైతం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో పవన్ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. తన పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని కుండబద్దలు కొట్టారు.

సోదరుడు నాగబాబుకు పవన్ షాక్.....
జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాధూరాం గాడ్సేను వెనకేసుకొస్తూ కొన్ని రోజుల క్రితం సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గతంలోనూ మీడియా ద్వారా తాను ఇదే విషయం చెప్పానని పవన్ గుర్తుచేశారు.

ప్రత్యర్ధులు వక్రీకరిస్తున్నారు...
ఈ మధ్య పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్ధులు వక్రీకరిస్తున్నారని, అందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే కోవలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు కూడా పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్ స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను పార్టీ అధికారిక పత్రాల ద్వారా, అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పవన్ సూచించారు.

పార్టీ శ్రేణులకు పవన్ హితవు...
సోదరుడు నాగబాబు కామెంట్స్ వ్యవహారంపై రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులకూ పవన్ ఓ సూచన చేశారు. ఇది ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న కాలమని, కరోనాతో ప్రజలు నానా అవస్ధలు పడుతున్నారని, ఈ తరుణంలో జనసైనికులు ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని పవన్ వారిని కోరారు. క్రమ శిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలన్నారు.

ముప్పేట దాడితో పవన్ వివరణ...
నాగబాబు గతంలోనూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను చెప్పేవారు. అయితే ఈసారి ఏకంగా జాతిపిత హంతకుడిని సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి. ఓ దశలో గాడ్సేను సమర్ధిస్తారని ప్రత్యర్ధులు విమర్శించే బీజేపీలో పవన్ ఉన్నందునే ఆ పార్టీ నేతలను మెప్పించేందుకు నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. చివరికి ప్రత్యర్ధులు నాగబాబు విమర్శలపై అన్న చిరంజీవిని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముప్పేట దాడి నేపథ్యంలో పరిస్ధితి మరింత విషమించకముందే స్పందించాలని భావించిన పవన్ ఈ వివరణ ఇచ్చినట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications