నా వద్ద మైక్ తప్ప ఇంకేమీ లేదు- పవన్: జరగేది కురుక్షేత్ర యుద్ధమే
మచిలీపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరో విడత వారాహి విజయయాత్ర చేపట్టారు. ఇప్పటికే ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ తాజాగా కృష్ణా జిల్లాలో అడుగు పెట్టారు. జిల్లాలోని అవనిగడ్డలో వారాహి యాత్రలో పాల్గొన్నారు. స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు.
యథా ప్రకారం- పవన్ కల్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించారు. గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆయన మంత్రివర్గ సహచరులపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల గురించీ మాట్లాడారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. తాము పాండవులం అని, వైఎస్ఆర్సీపీ నాయకులు కౌరవులుగా అభివర్ణించారు. ఈ సారి జరగబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తాయని, ఆ ధర్మయుద్ధంలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దేశాన్ని ప్రేమించేవాడితో, దేశభక్తి ఉన్న వాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జగన్కు చూపిస్తానని సవాల్ విసిరారు. తనను తాను భగత్ సింగ్ భక్తుడిగా ప్రకటించుకున్నారు. జనసేన-తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. లక్ష కోట్ల రూపాయలను జగన్ దోచుకున్నాడని, వారి వద్ద కిరాయి సైన్యం ఉందనీ ఆరోపించారు.
పోలీసులను అడ్డుగా పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని, దీని గురించి ప్రశ్నించిన వారని జైలుపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ వద్ద అధికారం ఉండగా.. తమ వద్ద ఒక్క మైక్ తప్ప ఏమీ లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని, అయినప్పటికీ- ఆశయాలు, విలువల కోసం పార్టీని నడుపుతున్నానని అన్నారు.
తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కావడం వల్ల వారి సాధక బాధకాలన్నీ తెలుసునని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 30,000కు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో తాను నిబద్ధతగా ఉంటానని అన్నారు.












Click it and Unblock the Notifications