సమాజం కోసం డబ్బు వదులుకున్నారా? జేడీ లక్ష్మీనారాయణపై పవన్ విమర్శలు.. రాపాకపైనా ఫైర్
జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ సీఎం జగన్ను సమర్థిస్తోన్న రాపాక వరప్రసాద్, ఇటీవలే జనసేనకు రాజీనామా చేస్తూ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసిన జేడీ లక్ష్మీనారాయణలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి ఎవరు వెళతారో, ఎవరు ఉంటారో కాపలా కాయాల్సిన అవసరం తనకు లేదన్నారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయవాడ ఈస్ట్, నరసాపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో భేటీ సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు.

జేడీలాంటోళ్లే ప్రశ్నించుకోవాలి..
పార్టీ నుంచి వెళ్లిపోయేటప్పుడు అధినేతలపై విమర్శలు చేయడం సహజమేనని, జేడీ విషయంలోనూ అదే జరిగిందని జనసేనాని అన్నారు. ‘‘నేను సినిమాలు అంగీకరించినందుకే వెళ్లిపోతున్నానని జేడీ విమర్శించడంలో అర్థం లేదు. నామీద ఆధారపడ్డవాళ్లు, నా ఫ్యామిలీ కోసమే సినిమాలు ఒప్పుకున్నాను. నాకేమీ లక్షల కోట్ల ఆస్తులు, కోట్లిచ్చే కంపెనీలు లేవు. ఈ విమర్శలు చేస్తున్నవాళ్లు తమ జీవితంలో ఏనాడైనా సమాజం కోసం కనీసం వెయ్యిరూపాయల డబ్బు వదులుకున్నారా?''అని పవన్ ప్రశ్నించినట్లు కార్యకర్తలు వెల్లడించారు.

రాపాకది ఏ పార్టీ?
ఎమ్మెల్యే రాపాక గెలిచింది జనసేన నుంచే కానీ ఇప్పుడాయన ఏ పార్టీలో ఉన్నారో అర్థంకావడంలేదని పవన్ వాపోయారు. భావజాలం లేని వ్యక్తులు పార్టీ నుంచి దూరంగా వెళ్లిపోతారని, అదే భావజం ఉన్న వ్యక్తులైతే ఎప్పటికీ జనసేనతోనే ఉండిపోతారన్న ఆయన.. రాబోయే రోజుల్లో కేవలం పార్టీని ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తానని చెప్పారు.

ఒక్క ఛాన్సిచ్చి మోసపోయాం..
ఎన్నికలప్పుడు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్.. ఒక్కఛాన్స్ అని బతిమిలాడుకున్నాని.. తీరా అధికారం దక్కిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. భవంతుల కూల్చివేతలు, చట్టసభల రద్దు, రాజధాని తరలింపులు, ప్రతిపక్ష నేతలను నోటికొచ్చిన బూతులతో తిట్టడం తప్ప వైసీపీ నేతలకు ఇంకేమీ చేతకాదని ఆయన విమర్శించారు.

స్థానిక ఎన్నికల్లో జెండాపాతేంగే..
వైసీపీకి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లేసిన ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ళపట్టాలు లభించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని, కృష్ణానది ఒడ్డునున్న ఊళ్లకు కూడా నీటి కొరత ఏర్పడిందన్న పవన్ కల్యాణ్.. అంశాలవారీగా రాష్ట్రప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కార్యకర్తలతో చెప్పారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు చక్కటి అవకాశమని, వార్డువార్డులోనూ జనసేన సత్తా చాటేలా వ్యూహాలు సిద్ధం చేద్దామని పవన్ పిలుపునిచ్చినట్లు కార్యకర్తలు తెలిపారు.












Click it and Unblock the Notifications