కరెంట్ కోతలు వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్లే.. మా సహనాన్ని పరీక్షించొద్దు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసిపి అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పల్లెల్లో 14 గంటలు పట్టణాల్లో ఎనిమిది గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియజేస్తున్నాయి అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగిందని వెల్లడించారు. 36 లక్షల మంది కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఫోన్ లైట్ల వెలుగులో ప్రసవాలు, ఆపరేషన్లు ... విద్యుత్ సంక్షోభానికి ఇవే నిదర్శనం
వైసిపి ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పల్లెల్లో 11 నుండి 14 గంటలు, పట్టణాల్లో 5 నుండి 8 గంటలు, నగరాల్లో నాలుగు నుండి ఆరు గంటల చొప్పున విద్యుత్ కోత విధించడంతో జనం అల్లాడిపోతున్నారు అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆసుపత్రులలో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పెద్దగా విద్యుత్ కోతలు లేవు
శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదని, దీంతో గత ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదని పేర్కొన్నారు. కేవలం ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భారం మోయలేమని గోడు వెళ్లబోసుకున్నారు అని, తాను ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున ఆ విషయాన్ని తీసుకు వెళ్ళినప్పుడు పెంచిన చార్జీలను ఉపసంహరించుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
టీడీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు .. వైసీపీ తప్పుడు నిర్ణయాలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న పవర్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసిందని, యూనిట్ నాలుగు రూపాయల ఎనభై పైసల చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి యూనిట్ 2 రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పిందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం కోల్ ఎనర్జీని 20 రూపాయలు పెట్టి కొంటుందని, ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేసిన వైసీపీ
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నాయకత్వం ప్రస్తుత 57 శాతం చార్జీలు పెంచిందని పేర్కొన్నారు. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్ల ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని నాడు చెప్పిన వైసిపి, ఇప్పుడు విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు, పరిశ్రమలకు కరెంట్ కోతలతో ఇబ్బంది
పగలంతా తరగతి గదిలో ఉండి, రాత్రులు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇళ్ళల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వేస్టేషన్ బస్టాండ్ లలో పడుకుంటున్నారని రాష్ట్రంలో కరెంటు కోతలతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయి అని తెలిపారు.
Recommended Video
పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం.. 36 లక్షల మంది కార్మికులపై ప్రభావం
అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంటులో ఇక 50 శాతం మాత్రమే వాడాలని నిబంధన విధించారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారు అని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ 36 లక్షల మంది కార్మికులు ఉపాధి పై దీని వల్ల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించవద్దు
వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని, ప్రజలు అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో పార్టీని ప్రారంభించామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ చార్జీల వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని వెల్లడించారు. ఉద్యోగులు రోడ్ ఎక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. తాము ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అంటూ దూషణలకు దిగుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించవద్దు అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్లు రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించే వరకు వైసిపి అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతిఒక్క జన సైనికుడు, వీర మహిళా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.