ప్రాణాలు తెమ్మనండి, కెసిఆర్కి నోటి దురుసు: పవన్ ఫైర్
నిజామాబాద్: నిజామాబాద్ బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జై తెలంగాణ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను రాజకీయాలు చేయడం కోసం తెలంగాణ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. తనకు తెలంగాణ అంటే ప్రేమ అని, ఇష్టమన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టమని మీకు తెలుసు.. నాకు తెలుసునన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందనే విషయాన్ని పక్కన పెట్టి... తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రాగానే అందరూ.. తమ వల్లే తెలంగాణ వచ్చిందని పోటీ పడుతున్నారని, కానీ ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చిందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వందల మంది చనిపోతుంటే యూపిఏ ప్రభుత్వం 2004 నుండి ఎందుకు తాత్సారం చేసిందని ప్రశ్నించారు. తమ వల్లే తెలంగాణ వచ్చిందని కాంగ్రెసు నేతలు చెబితే... వందలమంది ప్రాణాలు తీసుకు రావాలని అడగాలన్నారు.

కుటుంబ పాలనపై..
తనకు కుటుంబ పాలన ఇష్టం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తాను తెలంగాణవ్యాప్తంగా పర్యటించి ఇక్కడి బాధలు, కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. దురదృష్ఠవశాత్తు తాను నటుడినే అయినా, కుటుంబ రాజకీయాలు చేయాలనుకోలేదన్నారు. కుటుంబ రాజకీయాలు చేయాలనుకుంటే తాను వెనుకే ఉండేవాడినని లేదా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వాడినన్నారు. కుల, మతాలకు అతీతంగా రాజకీయం చేయాలన్నారు.
నిజామాబాదు లోకసభ బరిలో తెరాస నుండి కవిత కాంగ్రెసు నుండి మధుయాష్కీ, బిజెపి నుండి యెండల పోటీ చేస్తున్నారన్నారు. మూడు పార్టీలు ముఖ్యమైన పోటీ ఇదే అన్నారు. తాను అడిగితే మీరు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. తాను నటుడిని అయినందున తన బలం ఎంతో తనకు తెలియదన్నారు. సమస్యలు చూసే తాను జనసేన పార్టీని స్థాపించానన్నారు. యువతకు దారి చూపేది మోడీ ఒక్కరేనన్నారు. కాంగ్రెసు నేతలు వస్తే పదేళ్లుగా ఏం చేశారని అడగండన్నారు.
కెసిఆర్ పైన నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయన పైన మండిపడ్డారు. తెరాస మేనిఫెస్టో ఎంతో బాగుందని కానీ కెసిఆర్ బూతులు తిడితే ఎలా అన్నారు. కెసిఆర్ తిడితే పడతామని... అయితే దేశం కోసం వచ్చిన మోడీని కూడా అనడం ఏమటని, దీనిని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తాను ఇక్కడకు రావడానికి కారణం మోడీయే అన్నారు.
తెలంగాణ వస్తే కాంగ్రెసు పార్టీలో తెరాసను విలీనం చేస్తానని మాటిచ్చిన కెసిఆర్ ఆ తర్వాత చీకొట్టారన్నారు. బిజెపి నేతల వద్దకు వెళ్లి టి బిల్లుకు మద్దతివ్వాలని కెసిఆర్ కోరారన్నారు. అయితే, బిజెపి కెసిఆర్ కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం బిల్లుకు మద్దతిచ్చిందన్నారు. అప్పుడు మద్దతు కోసం అడిగిన కెసిఆర్.. ఇప్పుడు మతతత్వ పార్టీ అంటున్నారని విమర్శించారు. కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఇదేనా రాజకీయమంటే అన్నారు.
శ్రవణ్ కుమార్కు కులం పేరు చెప్పి కెసిఆర్ సీటు ఇవ్వలేదన్నారు. మనిషికి కులం ముఖ్యం కాదని గుణం ముఖ్యమన్నారు. కెసిఆర్ మూడో ఫ్రంట్కు మద్దతిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన నిత్యం అమర్యాదగా మాట్లాడుతారన్నారు. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుందన్నారు. మేనిఫెస్టోలో గొప్పగా ఉన్నప్పటికీ.. కెసిఆర్ మాటలు మాత్రం అమర్యాదగా ఉన్నాయన్నారు. తాను బాపట్లలో పుట్టానని అయినా తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందన్నారు.
ఎవరి పుట్టుక అయినా వారి చేతుల్లో లేదని, ఎలా ఉండాలో అనేది మాత్రం వారి చేతుల్లోనే ఉందన్నారు. 2009లో హైటెన్షన్ వైర్ షాక్ తగిలినప్పుడు... కొండగట్టు ఆంజనేయ స్వామి దయవల్ల తాను బతికానన్నారు. తెలంగాణ తన గుండె లోతుల్లో ఉందన్నారు. తన నరనరాన తెలంగాణ ఉందన్నారు. అన్యాయం జరిగితే తెలంగాణ సాయుధ పోరాడ వీరుడిలా ఎదుర్కోగలనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తి అన్నారు.
కెసిఆర్ సోనియా ఇంటికి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులను మాత్రమే తీసుకు వెళ్లారన్నారు. తెలంగాణ అంటే ఆయన కుటుంబం మాత్రమే కాదని, మనమందరం అని గుర్తుంచుకోవాలన్నారు. కెసిఆర్ మాటల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. బాధ్యత గల నాయకుడు మాట్లాడే విధానం ఇది కాదన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివరలో కాంగ్రెసు హటావో అంటూ నినదించారు.
సోనియా, మన్మోహన్ల పైన
తెలంగాణ పైన కాంగ్రెసు పార్టీ నేతలు కపట ప్రేమ చూపుతున్నారన్నారు. పివి నర్సింహ రావును అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ నేత అయిన పివినే గౌరవించిన కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజల పట్ల ఎలా ప్రేమ చూపుతుందన్నారు. అదంతా కపట ప్రేమ అన్నారు. మన్మోహన్ సింగ్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదన్నారు. అయితే, ఆయనను సోనియా నడిపిస్తోందని ఇటీవలి పుస్తకాలు చెబుతున్నాయన్నారు. ప్రధాని పదవిలో ఉంటే ధైర్యం ఆమెకు లేదన్నారు.












Click it and Unblock the Notifications