బడ్జెట్పై స్పందించిన పవన్, మూడ్రోజుల్లో మోడీతో భేటీ: 21న శ్రీకాకుళం పర్యటన
Recommended Video
హైదరాబాద్/శ్రీకాకుళం: ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులపాటు పర్యటించి రైతులు, ఇతర రంగాల ప్రజల సమస్యలు తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలంగా మత్స్యకారులు పడుతున్న సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తనవంతుగా ప్రయత్నించేందుకు పవన్ ఈ పర్యటన చేస్తున్నారు.
ఫిబ్రవరి 21న శ్రీకాకుళం జిల్లాకు వెళ్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వారిని ఆయన కలవనున్నారు.
బాధాకరం
కాగా, హైదరాబాద్లో సోమవారం తనను కలిసిన మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న దీక్ష భగ్నమైందని తెలిసిందని, ఇది బాధాకరమని అన్నారు. నిరసనలను అడ్డుకోవడం సరికాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, పోరాటాలకు ముందుండే జిల్లా అని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పర్యటన వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వ దృష్టికి..
మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు. కాగా, ఇందుకు ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది.
మత్స్యకారుల సమస్యలపై కదలిక
పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ‘కొవ్వాడ'ను కూడా సందర్శించే అవకాశాలున్నాయి. అక్కడి సమస్యలను తెలుకోనున్నారు. గతంలో ఉద్దానంలో పర్యటించినప్పుడు అక్కడ కిడ్నీ వ్యాధి సమస్యపై ప్రభుత్వం స్పందించింది. ఆ బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. అలాగే మత్స్యకార్లు సమస్యలపై కూడా కదలిక వస్తుందని వారు భావిస్తున్నారు.
ప్రధాన సమస్యలు
కాగా, శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతంలో 11 మండలాల్లో వీరి జనాభా దాదాపు రెండు లక్షల వరకు ఉంది. చేపల వేటే ప్రధానంగా ఉన్న వీరు ...ఏడాదిలో చాలా రోజులు ఉపాధికి పలు ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాలర్లు ద్వారా సముద్రంలో దూర ప్రాంతాలకు వెళ్లి చేపలు వేట చేస్తుండడం, తీరంలో ఏర్పాటు చేస్తున్న కొన్ని రసాయనిక, ఇతర పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలోనే కలుస్తుండడంతో చేపల వేట తగ్గిపోతుంది.
పవన్ రాకతో..
చేపల వేటే ప్రధానంగా ఉన్న మత్స్యకార్లు ఉపాధికి నేడు అనేక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ట్రాలర్లులో పనిచేయడానికి గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు వలస పోతున్నారు. కొంతమంది ఊయలు, వలలు అల్లుకొని జీవనం సాగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో పవన్ రాకతో తమ సమస్యలు తీరుతాయని మత్స్యకారులు భావిస్తున్నారు.
బడ్జెట్పై స్పందించిన పవన్.. మోడీతో భేటీ
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో జరిగిన అన్యాయంపై తాను త్వరలో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు తెలిసింది. ఏపీ సమస్యలపై తాను త్వరలో(మూడు రోజుల్లో)నే ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు పార్టీలు జవాబుదారీగా ఉండాలని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.