ఇట్స్ క్లియర్?: పవన్ శత్రువు ఎవరో తేలిపోయింది.., వైసీపీని చావుదెబ్బ కొట్టడానికే కంకణం?
Recommended Video
విశాఖపట్నం: రాజకీయాల్లో నాన్చుడు ధోరణి అంతగా పనికొచ్చే వ్యవహారం కాదు. అధినేతల మార్గదర్శకాల మేరకు నడుచుకునే నేతలపై విరుచుకుపడినంత మాత్రానా ఒరిగేదేమి ఉండదు.
బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలను గమనిస్తే ఇదే విషయం తలపుకురాక మానదు. గతానికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ అదే విధేయతను కనబరుస్తున్నారు.
ఆయన వైఖరి చూస్తుంటే.. జగన్ రాజకీయాలకు మోకాలడ్డటం.. పరోక్షంగా చంద్రబాబుకు వంత పాడటం లాగే ఉందన్న అభిప్రాయాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
టార్గెట్ 'జగన్':
'నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే పదవులు కావాలా?, సీఎం అయి తీరాలా?.. ఇవేవి లేకుండా ప్రజలకు సేవ చేయలేరా?.. గుండెల్లో తిష్ట వేసుకున్న ప్రేమ చాలు.. నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే!'.. ఇవి నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పరోక్షంగా జగన్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు.
తండ్రి సీఎం అయినంత మాత్రానా.. కొడుకు కూడా సీఎం కావాలా? అని ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డా.. ఇంకా సంపాదించాలన్న దురాశ పోదన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఇవన్నీ జగన్ కు సూటిగా తాకిన విమర్శలే.
ఏం చెప్పదల్చుకున్నారు?:
పవన్ వ్యాఖ్యలను బట్టి గమనిస్తే.. ఆయన జగన్ ను మాత్రమే బలంగా ఎదుర్కోవడానికి సిద్దపడ్డట్లు కనిపిస్తోంది.ఒకవైపు వైసీపీ ఉనికిని దెబ్బ తీసేలా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాలు కొనసాగుతుంటే.. ఆ పార్టీని మరింత చావుదెబ్బ తీయడానికి పవన్ కళ్యాణ్ కూడా కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదంటూనే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయకపోవడంలో పవన్ కళ్యాణ్ అంతరంగం ఏంటనేది చాలామందిని ఆలోచింపచేస్తున్న విషయం.
లోకేష్-జగన్ పై విమర్శల్లో తేడా:
లోకేష్పై స్పందించాల్సిందిగా అభిమానులు, కార్యకర్తలు పెద్దగా అభ్యర్థించడంతో పవన్ స్పందించారు. కానీ జగన్పై స్పందించిన తీరుకు, లోకేష్పై స్పందించిన తీరుకు చాలా స్పష్టంగా తేడా కనిపించింది. సీఎం తలుచుకుంటే పదవులకు కొదవా అంటూనే.. బహుశా లోకేష్ లోని సామర్థ్యం చూసి ఇచ్చారేమో అంటూ పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
'పోలవరం' పర్యటనకు ఈరోజే ఎందుకు?:
జగన్ తన పాదయాత్రను ప్రకటించిన తర్వాతే.. పవన్ కళ్యాణ్ కూడా 'అవసరమైతే పాదయాత్ర చేస్తా' అంటూ అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు పోలవరం విషయంలోను వైసీపీకి పోటీగా వెళ్తున్నారు. గురువారం వైసీపీ నేతలు పోలవరం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో.. జనసేన కూడా పోలవరం పర్యటనకు సిద్దమైపోవడం పవన్ కళ్యాణ్ వైఖరిని మరింత స్పష్టం చేస్తోంది. పవన్ వెళ్తే.. వైసీపీ కన్నా ఎక్కువ ఫోకస్ తన పైనే ఉంటుంది కాబట్టి ఆవిధంగా వారి ప్రభావం తగ్గించవచ్చనే వ్యూహం కనిపిస్తోంది.
తెలిసీ ఎందుకు ప్రశ్నించలేదు?:
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయం తనకు తెలుసని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకల గురించి తెలిసి కూడా.. పవన్ ఇన్నాళ్లు ఎందుకు దీనిపై ప్రశ్నించలేదన్నది ఆయనకే తెలియాలి. నిన్నటి ప్రసంగంలోనూ పోలవరం అవినీతి అంటూ ప్రస్తావించారే తప్ప అసలు విషయమేంటో చెప్పనేలేదు.