పవన్ తిక్క వెనుక బాబు లెక్క! అంతా ప్లాన్ ప్రకారమే??
విజయవాడ : 'ప్రత్యేకహోదా' ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయిన సెంటిమెంట్. ఒక విధంగా ఏపీలోని రాజకీయ పార్టీల చిత్తశుద్దికి ప్రజల్లో ఇప్పుడిదో పారామీటర్. అందుకే హోదాపై గట్టిగా గొంతు వినిపించే పార్టీకే భవిష్యత్తు రాజకీయాల్లో మైలేజ్ ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఆయా పార్టీల నేతల్లో ఉంది.
ప్రైవేటు బిల్లు ద్వారా కాంగ్రెస్, సందర్బం వచ్చిన ప్రతిసారి హోదాపై మాట్లాడుతూ జగన్.. ఇప్పటికే ప్రజల్లో అంతో ఇంతో హోదాపై తమ చిత్తశుద్దిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న కారణాన.. టీడీపీది సేఫ్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి. గట్టిగా నిలదీయలేదు.. అలా అని కేంద్రం నుంచి బయటకు రాలేదు.. మరలాంటప్పుడు ప్రజల్లో తమ పట్ల విశ్వసనీయతను కలిగించేదెవరు? హోదాపై పోరాడిన క్రెడిట్ జగన్ ఖాతాలో పడకుండా చేయగలిగేది ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా కనిపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆఘ మేఘాల మీద ఆయన తిరుపతి సభను ఏర్పాటు చేశారన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ సహకారం లేకుండా అంతపెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అదీగాక.. సభ నిర్వహించడానికి కారణం అభిమాని హత్య నేపథ్యం కాదని, పవన్ హైదరాబాద్ లో ఉన్నప్పుడే తిరుపతి సభకు ప్లాన్ చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనా!!
ఈమధ్య తరుచూ సర్వేలు చేయిస్తూ.. సర్వే ఫలితాల పట్ల చంద్రబాబు కొంత అసంతృప్తిలో ఉన్నారన్న వాదన వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తిరుపతి, కర్నూల్, విశాఖపట్నం లాంటి ముఖ్య పట్టణాల్లో కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హోదా ఎఫెక్ట్ గనుక పనిచేసి.. టీడీపీ కంటే వైసీపీ మెరుగైన ఫలితాలను సాధిస్తే.. పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెరిగే అవకాశముంది.
ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే.. పార్టీలో ఉన్న నేతలు కాకుండా, పవన్ లాంటి వ్యక్తులు పార్టీ పట్ల కొంత సానుకూలంగా స్పందిస్తే.. ప్రజల్లో విశ్వసనీయత పెరిగే అవకాశముంది. అందుకే.. తిరుపతి సభలో టీడీపీ ఎంపీలను విమర్శించినా.. చంద్రబాబు పనితీరును మాత్రం పవన్ అంతగా విమర్శించే ప్రయత్నం చేయలేదు.
కాపు రిజర్వేషన్ల ఎఫెక్ట్ :
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ కూడా పూర్తయిపోయింది కాబట్టి, ఇప్పుడా అంశం కూడా టీడీపీని మళ్లీ కుదిపేసే అవకాశాలున్నాయి. అటు ముద్రగడ కూడా దాసరి, చిరంజీవి లాంటి నేతలతో సంప్రదింపులు జరుపుతూ.. ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో.. పవన్ లాంటి వ్యక్తి తెరపై ఉంటే మిగతా విషయాలేవి అంతగా ఫోకస్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి, కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరికొంత కాలం స్తబ్దుగా ఉంచేలా చేయడంలో టీడీపీకి పవన్ పనికొస్తున్నాడనే వాదన కూడా ఉంది. చూడాలి మరి.. పవన్ మున్ముందు మరిన్ని సభలు నిర్వహించబోతున్నారు కాబట్టి, కాపు ఉద్యమం గురించి ప్రస్తావిస్తారా లేక పట్టనట్లే ఉంటారా అన్నది.
ఏదేమైనా.. పవన్ వ్యవహారమంతా పాత ధోరణిలోనే సీఎం చంద్రబాబుకు టీడీపీకి అనుకూలంగా సాగుతోందన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.