తీపిని పంచే చెరకు రైతుల జీవితాలలో చేదు; బకాయిలు ఇప్పించాల్సిన ప్రభుత్వం తీరు శోచనీయం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్కెర రైతుల కోసం మరోమారు ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. అందరి జీవితాల్లో తీపి నింపుతున్న చెరుకు రైతుల జీవితాల్లో చేదు మిగిలింది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతులకు రావలసిన బకాయిలు చెల్లించాలని నెల రోజులు గా దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆందోళన ఎక్కువైందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రైతులకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
గత రెండేళ్లలో షుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు రావాల్సిన 16.38 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పించేలా చూడవలసిన పాలనా యంత్రాంగం ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూడటం సరైంది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాల నుండి రావాల్సిన బకాయిలను ఇప్పించవలసిన ప్రభుత్వం జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తానని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ దుస్థితి
పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కూడా నలిగి పోతున్నారని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ , రైతులు సమస్యకు పరిష్కారం దొరికేవరకు జనసేన రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు చక్కెర కర్మాగారాల నుండి రావలసిన బకాయిలు ఇవ్వకుంటే ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పదిహేను రోజుల్లోనే రైతులకు డబ్బులు వచ్చేలా చూడాల్సిన ప్రభుత్వం రెండు సీజన్లుగా బకాయిలను చెల్లించని కర్మాగారాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు పవన్ కళ్యాణ్.

రైతులకు అండగా జనసేన పార్టీ
రైతులకు కర్మాగారాల నుండి రావలసిన బకాయిలు వచ్చేలా వారి కోసం జనసేన ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత రెండు సీజన్ల నుండి చెరకు రైతులకు 90 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చెరకు రైతుల బకాయిలపై బిల్లులు చెల్లించాలని కోరుతూ విజయనగరంలోని ఎన్సిఎస్ కర్మాగారం వద్ద వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం రైతుల బకాయిల చెల్లింపుకు చొరవ చూపాలి
చెరకు రైతుల బకాయిల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ రైతులు, నాయకులు పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు . రైతులపై తక్షణమే పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. చెరకు రైతుల బకాయి బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, చెరకు రైతుల బకాయిలపై వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

లచ్చయ్యపేట ఎన్సిఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెక్కెర రైతుల ఆందోళన .. ఉద్రిక్తత
ఆరుగాలం శ్రమించి చెరుకు పంట పండించిన చెరుకు రైతులు అమ్మిన పంటకు ఏళ్ళతరబడి బకాయిల నగదు అందకపోవడంతో బకాయిల చెల్లింపుకు ఆందోళన బాట పట్టారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సిఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతులు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రైతులను అరెస్టు చేశారు. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులకు రైతులు ఎదురు తిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులపై రైతులు దాడికి దిగారు. దీంతో రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications