చొక్కా పట్టుకొని అడగండి, భారత్ మాతాకీ జై అనలేదు: జగన్ను టార్గెట్ చేసిన పవన్
Recommended Video

రాజానగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ రాజకీయ నేతలకు బుద్ధి రావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మండిపడ్డారు. రాజానగరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సినిమాలు చేసుకుంటే కోట్లాది రూపాయలు వస్తాయని, కానీ ప్రజలకు సేవ చేసే ఆనందం కనిపించదన్నారు. నా ఇంటి పేరు తెలుగు అని, తెలుగు జాతి తన కుటుంబమని చెప్పారు.
ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. ఏపీలో అవినీతిరహిత పాలన రావాల్సి ఉందని చెప్పారు. అవినీతిని ఎదిరించే జెండా జనసేన జెండా అన్నారు. దోపిడీదారులను నిలదీసే జెండా మనదే అన్నారు. మనల్ని కన్న భూమి భారతభూమి అని, కానీ వైసీపీ అధినేత వైయస్ జగన్ భారత్ మాతాకీ జై అని ఎప్పుడూ అనలేదని విమర్శించారు.

జగన్ ఎప్పుడూ ప్రశ్నించలేదు
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని జగన్ ఎప్పుడూ ప్రశ్నించలేదని పవన్ విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జగన్ బాధ్యత అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని జనసేన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తోందన్నారు. సెజ్ల పేరుతో దోచుకుంటున్నారన్నారు. అవినీతిని నిర్మూలించి దీపావళి జరుపుకుందామన్నారు. అవినీతి అలవాటుగా మారిందన్నారు.

నన్ను చొక్కా పట్టుకొని నిలదీయవచ్చు
తమ వద్ద వేల కోట్లు లేవని, పెద్దపెద్ద నాయకులు లేరని పవన్ చెప్పారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను పాతికేళ్ల పాలన ఇవ్వడానికే పార్టీ పెట్టానని చెప్పారు. సమస్యలపై పోరాడేందుకే రంగంలోకి దిగానని చెప్పారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకొని నిలదీయవచ్చునని చెప్పారు. తనది ఒకటే మాట ఒకటే బాణమని చెప్పారు. సమసమాజాన్ని స్థాపిద్దామన్నారు.

చంద్రబాబు తప్పు, కాంగ్రెస్ను నిలదీసిన పవన్
2019లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. సినిమాల్లో నటించే పవన్ రాజమండ్రి కవాతు కోసం వస్తే లక్షలాదిమంది ఎందుకొచ్చారని, అందుకు ప్రభుత్వంపై ఉన్న కోపమే అన్నారు. రాజకీయ ప్రక్షాళన చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని, దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దోపిడీ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారని వాపోయారు.

టీడీపీని ఏపీ నుంచి తరిమేద్దాం
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన టీడీపీని ఏపీ నుంచి తరిమేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన సహకారం లేకుంటే 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు. రాజకీయాలను వ్యాపారంగా చూసే నాయకులు మనకు వద్దని చెప్పారు. మీ కోసం నిలబడేవాడు,, మీ ఇంట్లో వాడు మనకు కావాలన్నారు.
సినిమాల్లో వలే రాజకీయాల్లో నిబద్దతగా
తాను సినిమాల్లో ఎంత నిబద్దదతో ఉన్నానో, రాజకీయాల్లోను అంతే నిబద్దదతోను ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను పాతిక కేజీల బియ్యం ఇచ్చేందుకు పార్టీ పెట్టలేదని, పాతికేళ్ల పాలన ఇవ్వడానికి పెట్టానని చెప్పారు. మహిళలు కోరుకుంటే మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పారు. విద్యను ప్రయివేటు పరం చేసి, లిక్కర్ షాపులను మాత్రం ప్రభుత్వం నడుపుతోందన్నారు.












Click it and Unblock the Notifications