చిరంజీవిని మోసం చేసిన వైసీపీ మంత్రులెవరు - కోవర్టులుగా..!!
చిరంజీవిని మోసం చేసిన వారిలో వైసీపీ మంత్రులు కూడా ఉన్నారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు ప్రజారాజ్యంలో చిరంజీవితో ఉంటూ వైఎస్సార్ కోవర్టులుగా పని చేశారంటూ చెప్పుకొచ్చారు. వారు చేసిన కుళ్లు కుతంత్రాలు చిరంజీవి చూడలేకపోయారని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ - టీడీపీకి వ్యతిరేకంగా మార్పు కోసం అనేక మంది ప్రజారాజ్యంలో చేరారని..కానీ, నాడు జరిగిన పొరపాటు కారణంగా మార్పు సాధ్యం కాలేదని వివరించారు. దీంతో..అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.
పవన్ టార్గెట్ చేసింది ఎవరిని
వైసీపీ మంత్రులు గా పని చేసిన వారిలో ముగ్గురు నేతలు గతంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రెండు నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ తరువాత కొనసాగుతన్న ప్రస్తుత మంత్రుల్లో ఎవరికీ ప్రజారాజ్యంలో పని చేసిన అనుభవం లేదు. గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్.. తూర్పు గోదావరి నుంచి కన్నబాబు.. విజయవాడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ లు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచే ఈ ముగ్గురు 2009లోనూ గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగారు.
ఆ ముగ్గురి పైనే పవన్ గురి పెట్టారా
2014లో అవంతి టీడీపీ లో చేరి ఎంపీ అయ్యారు. వెల్లంపల్లి..కన్నబాబు 2014లో ఓడిపోయారు. 2019లో ఈ ముగ్గురు వైసీపీ నుంచి గెలిచి మంత్రులయ్యారు. ఇక, పవన్ కళ్యాణ్ వీరు మంత్రులుగా ఉన్న సమయంలోనూ పలు సందర్భాల్లో వీరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. ఈ ముగ్గురు నుంచి అదే విధంగా కౌంటర్ విమర్శలు వచ్చేవి. అయితే, ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురు కూడా చిరంజీవికి సన్నిహితంగా ఉండేవారు. కన్నబాబు ఇప్పటికీ చిరంజీవితో సత్సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. గత ఏడాది విషాదంలో ఉన్న కన్నబాబును పరామర్శించేందుకు చిరంజీవి ఆయన ఇంటికి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ లో చేరి కాకినాడ ఎంపీ అయిన వంగా గీత సైతం 2009 లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.
చిరంజీవిని మోసం చేసారంటూ
ఇప్పుటి వరకు రాజకీయంగా వీరి పైన విమర్శలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్..ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వీరు చిరంజీవిని మోసం చేసారంటూ వ్యాఖ్యానించారు. వీరి పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా, నాడు చిరంజీవి వద్ద వైఎస్సార్ కోవర్టులుగా వ్యవహరించిన వారు వైసీపీలో మంత్రులుగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ప్రజారాజ్యంలో పని చేసి వైసీపీలో మంత్రులుగా వ్యవహరించిన ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ తాజా ఆరోపణల పైన ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.