ఫ్యాన్స్ ఓటుబ్యాంకు సంఘటితం కోసం పవన్ కల్యాణ్..!!
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిమానుల ఓటు బ్యాంక్ను టార్గెట్గా చేసుకున్నారు. యువతను పెద్ద ఎత్తున ఆకర్షితులను చేయడానికి యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బస్సు యాత్ర కంటే ముందు పవన్ కల్యాణ్ ఈ సభకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన పార్టీ- తాజాగా 'యువ శక్తి' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా- జనవరి 12వ తేదీన తొలి సభను నిర్వహించనుంది జనసేన పార్టీ. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఈ సభ ఏర్పాటు కానుంది. ఉదయం 11 గంటలకు సభ ఆరంభమౌతుంది. దీనికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. యువ శక్తి పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలకు సంబంధించిన పోస్టర్ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

యువ శక్తి పేరుతో ఈ సభలను నిర్వహించబోతోండటం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. లక్షలాదిమందిగా ఉన్న తన అభిమానులను సంఘటితం చేయడానికే పవన్ కల్యాణ్ ఈ సభలను నిర్వహించబోతోన్నారనేది బహిరంగ రహస్యమే. దీనికి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యువ శక్తి పేరుతో ఈ సభలను నిర్వహించ తలపెట్టింది జనసేన పార్టీ.
నిజానికి- ఈ ఏడాది అక్టోబర్లో విజయదశమి తరువాత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. దీన్ని వాయిదా వేసుకున్నారాయన. జిల్లాలవారీగా నిర్వహిస్తోన్న జనసేన-జనవాణి కార్యక్రమాన్ని ముగించుకున్న తరువాత బస్సు యాత్రకు పూనుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవాణి ద్వారా ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయని, వాటిపై లోతుగా అధ్యయనం చేయడం- బస్సు యాత్రకు మరింత ఉపకరిస్తుందనేది జనసేన పార్టీ నేతల అభిప్రాయం.
బస్సు యాత్ర కంటే ముందే యువ శక్తి పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది జనసేన పార్టీ. అటు జనసేన-జనవాణి కార్యక్రమాల్లో కూడా యువత ఎదుర్కొంటోన్న సమస్యలను తెలుసుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్నారాయన. యువత ఓటుబ్యాంక్ ఎంత వరకు జనసేన వైపు ఆకర్షితమౌతుందనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications