పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ .. కోలుకున్న జనసేనాని !!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనావైరస్ బారినపడిన పవర్స్టార్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎట్టకేలకు కరోనా మహమ్మారి నుండి బయట పడ్డారు. జనసేనాని కరోనా బారినుండి కోలుకున్నారు.జనసేన పార్టీ ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
పవన్ కళ్యాణ్ కు కరోనానెగిటివ్, అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోలుకున్నారని ,వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించారని ఆ పరీక్షల్లో నెగటివ్ గా నిర్ధారణ అయింది అంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.అంతేకాదు ఆరోగ్యపరంగా ఆయనకు ఇబ్బంది ఏమీ లేవని వైద్యులు తెలిపారని కూడా పేర్కొంది. ఇదే సమయంలో తన ఆరోగ్య క్షేమం కోసం ఆకాంక్షించిన వారందరికీ, పూజలు,ప్రార్థనలు చేసిన వారందరికీ, జన సైనికులకు, నాయకులు,అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
అందరూ జాగ్రత్తలు పాటించాలని పవన్ విజ్ఞప్తి
ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారని జనసేన ప్రకటన ద్వారా వెల్లడించింది. తిరుపతిలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం, అలాగే వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత కరోనా బారినపడిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నారు.ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం కరోనా బారిన పడడంతో, పవన్ కళ్యాణ్ కు సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని రోజులు ఐసోలేషన్ లో ఉన్నారు.
పవన్ కోలుకున్న వార్త విన్న ఫ్యాన్స్, జనసేన నాయకుల్లో సంతోషం
ప్రస్తుతం కరోనా తగ్గిన తరువాత ఉండే చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతుడుగా బయటకు వస్తారని జన సైన్యం ఎదురుచూస్తోంది. పవన్ కోలుకున్న వార్త విన్న పవన్ ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడు బిజీ అవుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ వైఫల్యాలపై తనదైన శైలిలో విరుచుకుపడే విషయం తెలిసిందే.