రాహుల్ గాంధీ కనిపిస్తే కన్నుకొట్టి, గేటెడ్ కమ్యూనిటీలా అమరావతి: బాబుపై పవన్
అమరావతి: రాజధాని అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానిలో మీ ఇష్టానికి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ రాష్ట్రం మీ సొంతం కాదని, మీ రాజు కాదన్నారు. భూసేకరణ చట్టం రక్షణకు మహారాష్ట్ర రైతుల తరహాలో పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే అధికారులతో గొడవ పెట్టుకుంటామన్నారు.
నేను పర్సనల్ మాట్లాడితే, బ్రహ్మచారులా, జగన్! నేను ఊపేసేవాడిని: బాబు-రాహుల్లను ఏకేసిన పవన్
కనిపించే దేవుళ్లైన రైతులతో కన్నీళ్లు పెట్టించేలా పాలకులు వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. గర్భగుడిలోకి వెళ్లి ఎలా అపరాదం చేయరో.. అన్నదాతలను కూడా అలాగే భూముల నుంచి వెళ్లగొట్టవద్దన్నారు. ఎన్నికల సమయంలో రాజధానికి 1800 ఎకరాలు అవసరమని చెప్పి, ఇప్పుడు లక్షల ఎకరాలకు చేర్చారని ఆరోపించారు.
ఇన్ని ఎకరాలను ఎప్పటికి వినియోగిస్తారని ప్రశ్నించారు. ఇది పర్యావరణ విధ్వంసమే అన్నారు. ఇష్టానుసారం దోపిడీ చేసేందుకు ఇదేమీ చంద్రబాబు సొంత రాజ్యం కాదన్నారు. సొంత భూమిలోకి వెళ్లిన రైతులపై రౌడీషీట్ పెడతారని, కానీ మహిళా అధికారిపై చేయి చేసుకున్న చింతమనేని ప్రభాకర్ పైన మాత్రం పెట్టరన్నారు.
అడ్డుకొని తీరుతాం
2013 భూసేకరణ చట్టాన్ని పలుచన చేయడాన్ని అడ్డుకొని తీరుతామని పవన్ చెప్పారు. మహారాష్ట్ర తరహ రైతు పోరాటం చేస్తామన్నారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం నుంచి ప్రతి జిల్లా నుంచి లక్షల మంది రైతులతో అమరావతికి వస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటి వద్దకు, రాజధానికి వచ్చి కూర్చుంటామని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు రైతులు భయపడవద్దని, జనసేన, వామపక్షాలు అండగా ఉంటాయని చెప్పారు. అధికారులు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, పాలకులు చెప్పారని చేస్తే కుదరదని చెప్పారు. పెయింటింగుల్లోనే అమరావతి ఉందని, తాము అధికారంలోకి వస్తే పర్యావరణహితంగా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.
రాహుల్ గాంధీ కనిపిస్తే కన్నుకొట్టి ఇద్దరం ఒకటే అంటారు
ముఖ్యమంత్రిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాహుల్ గాంధీ కనిపిస్తే కన్నుకొట్టి మనమిద్దరం ఒక్కటే అంటారని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరిలో ఆక్వా కల్చర్పై ఏటా రూ.15వేల కోట్ల ఆదాయం వస్తోందని, అక్కడ ఇటీవల బస చేసిన హోటల్లో స్నానం చేద్దామంటే నీళ్లు పసుపు పచ్చగా వచ్చాయన్నారు.
అలా సేకరించే అవకాశం లేదు
రాజధానిలో రైతులు భూములు ఇవ్వకుంటే సేకరించే అవకాశం లేదని, భూములకు తగ్గ రేటు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, సమస్యను సక్రమంగా పరిష్కరించుకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ప్రజల కోసం పవన్లా పోరాడే వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఏక్తా పరిషత్ చైర్మన్ పీఆర్ రాజగోపాల్ అన్నారు. రాజధాని ప్రాంతంలో పోలీసుల దౌర్జన్యాలు పెరిగాయని తన అమరావతి పర్యటనలో రైతులు వాపోయారని జస్టిస్ గోపాల గౌడ అన్నారు. రైతుల సమస్యను చంద్రబాబు ఆలోచించాలని లేదంటే రాజకీయంగా పతనం అవుతారన్నారు. అమరావతి, బందర్ పోర్టు, బోగాపురం పోర్టు విషయంలో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి 1690 ఎకరాలను సింగపూర్ సంస్థకు అన్యాయంగా కట్టబెడుతున్నారని వడ్డె శోభనాద్రీశ్వర రావు అన్నారు.
గేటెట్ కమ్యూనిటీలా రాజధాని
జననసేన అధికారంలోకి వస్తే అందరూ కలిసి నివసించేలా రాజధానిని ప్రజారాజధానిలా నిర్మిస్తామని పవన్ అన్నారు. ఉద్దండరాయునిపాలెం గ్రామంలో అసైన్డ్ భూములకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరాహార దీక్ష చేపట్టిన రైతులకు ఆయన మద్దతుగా నిలిచారు. వారి పక్షాన పోరాడతానని హామీ ఇస్తూ వారితో దీక్ష విరమింపచేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే అమరావతిని 56 వేల ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారు చేస్తారేమో అనిపిస్తోందన్నారు. ఇది కేవలం ధనవంతులు మాత్రమే నివసించే నగరంలా చేస్తారేమోనన్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవని, రాజధాని కోసం చేసిన భూ సమీకరణ లోపభూయిష్టంగా ఉందని, బలవంతపు భూ సేకరణకు సిద్ధం అవుతున్నారన్నారు.
కార్యాలయానికి వస్తే సమస్యల పరిష్కారం
రాజధాని ప్రాంతంలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్, లంక భూములకు ప్యాకేజీ అమలు చేసే వరకు దళితులకు జనసేన అండగా ఉంటుందని పవన్ అన్నారు. ప్యాకేజీకి అదనంగా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం రావాల్సిన ప్లాట్లను తిరిగి కేటాయించాలని, వాటిని అమ్ముకునే హక్కులు కల్పించాలన్నారు. నివాస వసతి లేనివారికి 250 గజాల స్థలం ఇచ్చి, అమరావతిని ప్రజారాజధాని చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుకూలీలకు రూ.2500లు ఇచ్చి వెళ్లిపొమ్మంటున్నారన్నారు. సామాజిక మదింపు ప్రభావం సర్వే చేయాలని డిమాండ్ చేశారు. జనసేనను అధికారంలోకి తీసుకువస్తే పెద్దలు అన్నం మానేసి దీక్షలు చేయాల్సిన అవసరం ఉండదని, కార్యాలయానికి వస్తే నేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. రైతు కూలీలకు నెలకు రూ.10వేలు పింఛన్ ఇవ్వాలని, రాజధాని ప్రాంతంలో పేదల కోసం కడుతున్న ఇళ్లను ఉచితంగా కేటాయించాలన్నారు.