Pawankalyan : భవిష్యత్ వ్యూహం ప్రకటించబోతున్న పవన్-యువశక్తి సభలో ! పొత్తుపైనా తేల్చేస్తారా ?
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఏకపక్ష రాజకీయాలతో విపక్షాలు ఏకమవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా దూరంగా ఉండిపోతూ వచ్చిన జనసేన-టీడీపీ-బీజేపీ క్రమంగా దగ్గరవుతున్నాయి. తాజాగా చంద్రబాబు-పవన్ రెండుసార్లు భేటీ కావడంతో పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరు సాగించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ శ్రీకాకుళంలో జరిగే యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ వ్యూహాల్ని వెల్లడించబోతున్నారు.
జనసేన యువశక్తి సభ
ఏపీ రాజకీయాలకు, ముఖ్యంగా విపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇవాళ శ్రీకాకుళంలో యువశక్తి పేరుతో ఓ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో స్ధానిక యువత, ముఖ్యంగా మత్సకారుల్ని పిలిచి వారితో యువశక్తి గురించి చర్చించబోతున్నారు. అలాగే మత్సకారుల సంక్షేమంపై పవన్ కీలక హామీలు కూడా ఇచ్చే అవకాశముంది. అటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో పొత్తులపై తీసుకోవాల్సిన నిర్ణయాలు సహా, మూడు రాజధానుల వ్యవహారంపైనా పవన్ స్పందించబోతున్నారు. దీంతో ఈ సభకు ప్రాధాన్యం ఏర్పడింది.
ధర్మాన కామెంట్స్ పై పవన్ స్పందించే ఛాన్స్
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియకు ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన .. అమరావతే రాజధాని అయితే ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని కోరతామన్నారు. అలాగే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేసి తమకు న్యాయం చేయాలంటున్నారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రవచిస్తున్న నేపథ్యంలో అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రత్యేక రాష్ట్రం కోరడంపై పవన్ కళ్యాణ్.. ఆయన్ను నిలదీసే అవకాశముంది.
ఉద్దానం సమస్యలపైనా
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ తన నాలుగేళ్ల పాలనలో ఏం చేసిందనే దానిపై పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యతో పాటు రక్షిత మంచినీటి పథకాలు, ప్రాజెక్టులు ఇలా..ప్రతీ అంశాన్ని పవన్ టచ్ చేసే అవకాశముంది. అలాగే ఉత్తరాంధ్రలో యువత నిరుద్యోగులుగా మిగిలిపోవడం, మూడు రాజధానులతో వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ప్రభావం వంటి అంశాలపై పవన్ ప్రస్తావించబోతున్నారు.
భవిష్యత్ వ్యూహం ప్రకటించబోతున్న పవన్
శ్రీకాకుళంలో జరిగే యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ వ్యూహాల్ని ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా తాజాగా చంద్రబాబుతో భేటీ తర్వాత మారిన పరిస్ధితుల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుటుందా లేదా అన్న దానిపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అలాగే బీజేపీతో జనసేన బంధంపైనా పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువశక్తి సభ ద్వారా రాష్ట్రంలో యువతను తనవైపు తిప్పుకునేలా పవన్ కళ్యాణ్ పలు అంశాల్ని ప్రస్తావించబోతున్నారు. అలాగే యువతను రాజకీయాల్లోకి ఆహ్వనించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.