రాజధాని, బడ్జెట్ మంట: రంగంలోకి పవన్ కళ్యాణ్, 2 సమస్యలపై టూర్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఒక్కసారిగా రాజకీయాల పైన మరోసారి ప్రత్యేక దృష్టి సాధించారు. రాజధాని భూమి పైన వివాదం, బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన రంగంలోకి దిగారు.
ఏపీకి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ తదితరాల కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యను అడిగి తెలుసుకోనున్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులు పలువురు భూసమీకరణ పైన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ పైన వారి సంతృప్తి, ఇచ్చినది న్యాయబద్ధంగా ఉందా తెలుసుకునే ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు, ఏపీకి కేంద్రం సాయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సహకరించనున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ మద్దతు పలికారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయకపోయినా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయకపోయినా బీజేపీ, టీడీపీలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తాను నిలదీస్తానని అప్పుడే ప్రకటించారు.

అన్నట్లుగానే పవన్ ఇప్పుడు రంగంలోకి దిగారు. చాలారోజులుగా విపక్షాలు పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్నాయి. చంద్రబాబు, మోడీని పవన్ ఎప్పుడు ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశాయి. అయితే, నిన్నటి వరకు మౌనం దాల్చిన పవన్.. రాజధానిపై ఏపీ భూసమీకరణ పట్ల రైతుల అసంతృప్తి, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి నేపథ్యంలో బయటకు వచ్చారు. వారిని ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన, రాజధాని ప్రాంత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ పర్యటనల పైన ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలుత ఢిల్లీలో పర్యటించాలా లేక రాజధాని ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకోవాలా అనే విషయం తెలియనుంది. రాజధాని ప్రాంత రైతులు పవన్ సహకారం కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జనసేన జెండాలతో ఆందోళన కూడా చేశారు.












Click it and Unblock the Notifications